న్యూడిల్లీ, మే 9 : దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆన్లైన్ సేవలను మరింత విసృత పరచడంలో భాగంగా వాట్సాప్లో ప్రీమియం చెల్లింపులను జరిపేవిధంగా ‘వాట్సాప్ బోట్’ సేవలను ఆవిష్కరించింది. దీంతో కస్టమర్లు మరింత సౌకర్యంగా చెల్లింపులు జరిపేందుకు వీలుంటుంది. ఎల్ఐసీ కస్టమర్లు తమ ప్రీమియం చెల్లింపులు జరిపేందుకు మరో ప్రత్యామ్నాయం లభించినట్టు అయింది.
పోర్టల్లో రిజిస్టర్ కస్టమర్ నుంచి 8976862090కి వాట్సప్ ద్వారా సమాచారం ఇస్తే ఆ పాలసీదారుడికి సంబంధించి మొత్తం వివరాలు వెంటనే రానున్నాయని, ఇలా వచ్చిన వివరాల ఆధారంగా యూపీఐ/నెట్బ్యాంకింగ్/కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునని కంపెనీ సీఈవో, ఎండీ సిద్దార్థ మోహంతీ తెలిపారు. పాలసీదారుడు ఏ సమయంలోనైనా, ఎక్కడి నుంచైనా తమ ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునన్నారు. ప్రస్తుతం ఎల్ఐసీ కస్టమర్ పోర్టల్లో 2.2 కోట్ల మంది రిజిస్టర్ పాలసీదారులు ఉండగా, వీరిలో ప్రతీరోజు 3 లక్షల మంది లాగింగ్ అవుతున్నారు.