న్యూఢిల్లీ, నవంబర్ 16: అనీల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ (ఆర్సీఎల్) రుణాన్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్సీలు) విక్రయించేందుకు జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఏఆర్సీల నుంచి బిడ్స్ను ఆహ్వానిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్సీఎల్కు ఇచ్చిన రూ. 3,400 కోట్ల సెక్యూర్డ్ రుణం వసూలుకాకపోవడంతో ఎల్ఐసీ ఈ చర్యకు దిగింది. ఈ బిడ్స్ సమర్పించేందుకు నవంబర్ 25 చివరితేదీగా నిర్ణయించింది.
ఎల్ఐసీతో పాటు పలు బ్యాంక్లు సైతం ఆర్సీఎల్కు, దాని సబ్సిడరీలకు రుణాలిచ్చాయి. చెల్లింపుల్లో విఫలంకావడంతో ఎన్సీఎల్టీ ఉత్తర్వుల మేరకు రిజర్వ్బ్యాంక్ దివాళా ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ నాగేశ్వరరావు రిలయన్స్ క్యాపిటల్ విక్రయానికి గతంలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ను (ఈఓఐలు) ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో బైండింగ్ బిడ్స్ సమర్పించేందుకు నవంబర్ 28 చివరితేదీగా నిర్ణయించగా, ఎల్ఐసీ అంతకంటే మూడు రోజుల ముందే లావాదేవీ జరపాలని ప్రయత్నించడం రుణ దాతల కమిటీలో (సీవోసీ) ఇతర సభ్యుల్ని తీవ్రంగా నిరుత్సాహపర్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్సీఎల్కు రుణాలిచ్చిన బ్యాంక్లు, ఎల్ఐసీ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు.