LIC | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన కస్టమర్ల కోసం తాజాగా `ధన వృద్ధి` పేరిట సరికొత్త ప్లాన్ తెచ్చింది. ఈ నెల 23 నుంచి వచ్చే సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ పాలసీ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. సింగిల్ ప్రీమియంతో కూడిన ఈ ప్లాన్లో ఇన్సూరెన్స్తోపాటు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ హామీ ఉంటుందని తెలిపింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత పొదుపు సింగిల్ ప్రీమియం ప్లాన్ అని తెలిపింది. పాలసీదారు అనూహ్య మరణానికి గురైతే ఆర్థికంగా చేయూత కోసం రూపొందించిన ప్లాన్ ఇది.
ఈ పాలసీ మెచ్యూర్ అయ్యేలోపు పాలసీదారు మరణిస్తే, కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తారు. దాంతోపాటు మెచ్యూరిటీ సమయంలో గ్యారంటీ మొత్తం చెల్లిస్తారు. ఈ పాలసీలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒక ఆప్షన్ ప్రకారం పాలసీదారు మరణిస్తే హామీ మొత్తంపై 1.25 రెట్లు, మరో ఆప్షన్ ప్రకారం 10 రెట్లు బెనిఫిట్స్ అందజేస్తారు. మొదటి ఆప్షన్ కింద ఏడాదిలో రూ.60-75 రిటర్న్స్, రెండో ఆప్షన్లో రూ.25 నుంచి రూ.40 లేదా కనీసం రూ.1000 రిటర్న్స్ హామీ ఉంటుంది.
10,15,18 ఏండ్ల గడువుతో అందుబాటులో ఉంది ఎల్ఐసీ ధన వృద్ధి ప్లాన్. కనీసం 90 రోజుల పసికందు నుంచి ఎనిమిదేండ్ల వయస్సు, గరిష్టంగా 32 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయస్సు గల వారు ఈ ప్లాన్ కింద ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ప్రాథమికంగా రూ.1.25 లక్షల మొత్తం రిటర్న్స్ హామీ అందిస్తుంది. అటుపై రూ.5000 చొప్పున హామీ మొత్తం రిటర్న్స్ పెంచుకోవచ్చు. గరిష్ట పరిమితి లేదు.