న్యూఢిల్లీ, మే 4: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోలో తొలిరోజే పాలసీదారులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. సాధారణంగా ఏ ఐపీవో అయినా ప్రారంభమైన మొదటిరోజు అన్ని రకాల ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంటుంది. కానీ ఎల్ఐసీ ఆఫర్లో పాలసీహోల్డర్లకు రిజర్వ్ చేసిన విభాగం తొలిరోజే ఓవర్ సబ్స్ర్కైబ్ అయ్యింది. ఈ విభాగంలో 2,21,37,492 కోట్ల షేర్లను కేటాయించగా, బుధవారం బిడ్డింగ్ సమయం ముగిసేటప్పటికి 4,40,31,225 షేర్లకు (1.99 రెట్లు) పాలసీదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సంస్థ షేరుకు రూ.60 చొప్పున డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్సేంజ్ల్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం ఉద్యోగుల విభాగం సైతం పూర్తిగా సబ్స్ర్కైయిబ్ అయ్యింది. ఈ విభాగంలో 15,81,249 షేర్లను రిజర్వ్చేయగా, 18,53,430 షేర్లకు దరఖాస్తులు అందాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 61 శాతం షేర్లకు దరఖాస్తులు అందాయి. రిటైలర్లు, ఉద్యోగులకు షేరు రూ.45 చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది.
సంస్థల స్పందన అంతంతే
అర్హమైన సంస్థాగత ఇన్వెస్టర్లు(క్యూఐబీ), సంస్థాగతేతర ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ) తొలిరోజు ఎల్ఐసీ ఇష్యూ పట్ల పెద్దగా ఆసక్తి కనపర్చలేదు. క్యూఐబీ విభాగంలో 0.33 రెట్లు, ఎన్ఐఐ విభాగంలో 0.27 రెట్లు మాత్రమే బిడ్స్ వచ్చాయి. మొత్తంగా ఐపీవో మొదటి రోజు 67 శాతం సబ్స్ర్కైబ్ అయ్యింది. ఒక్కో షేరుకు రూ.902-949 ధరతో జారీ అయిన మే 9న ముగియనున్నది. మే 17 స్టాక్ ఎక్సేంజీల్లో ఎల్ఐసీ షేర్లు లిస్టవుతాయి.
ఏఎస్బీఏ బ్యాంక్ శాఖలు ఆదివారం ఓపెన్
ఎల్ఐసీ ఐపీవో దరఖాస్తుల ప్రాసెసింగ్కు వీలు కల్పిస్తూ ఏఎస్బీఏ (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) డిజిగ్నేటెడ్ శాఖల్ని మే 8 ఆదివారంనాడు సైతం తెరిచిఉంటాయని ఆర్బీఐ తెలిపింది. ఏఎస్బీఏ దరఖాస్తుల్ని ప్రాసెస్ చేసేందుకు సంబంధిత బ్యాంక్ శాఖల్ని మే 8న తెరవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. మార్కెట్లకు సెలవుదినమైన మే 7 శనివారం కూడా ఈ షేర్లకు బిడ్డింగ్ను అనుమతిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉద్యోగుల నిరసన ప్రదర్శన
‘ఎల్ఐసీ ఐపీవో డౌన్, డౌన్’ అంటూ ఆ సంస్థ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఎల్ఐసీ శాఖలు, డివిజనల్, జోనల్ కార్యాలయాల ముందు నినదించారు. ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ ప్రారంభంకావడాన్ని నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం రెండుగంటల పాటు వాకౌట్ సమ్మె జరిపారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ), ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లు సంయుక్తంగా ఇచ్చిన పిలుపుమేరకు 80,000 మంది ఎల్ఐసీ క్లాస్3, క్లాస్ 4 ఉద్యోగుల్లో 90 శాతం మంది సమ్మెలో పాల్గొన్నారు. ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయడానికి ఈ ఐపీవో మొదటిమెట్టు అని ఉద్యోగులు ఆరోపించారు.
6 నెలల్లో 20 శాతం రాబడి;ఎల్ఐసీ ఆఫర్పై అంచనా
ఎల్ఐసీ షేరు పట్ల పలువురు విశ్లేషకులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఐపీవో ధరతో పోలిస్తే ఇది ఆరు నెలల్లో 20 శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని గ్రీన్ఎడ్జ్ వెల్త్ కో పార్టనర్ దిగంత్ హరియా అంచనా వేశారు. ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను మాత్రమే అమ్ముతున్నందున ఆరునెలల్లో ఇంతమేర పెరుగుతుందని భావిస్తున్నానని, అటుతర్వాత ప్రభుత్వం మరింత వాటాను విక్రయించనున్నందున, ఏడాది తర్వాత ఇది క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చన్నారు.