హైదరాబాద్, మార్చి 1: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్చి నెలలో ప్రతిపాదించిన ఐపీవో వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ జారీచేసే సమయాన్ని మరోసారి పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ ‘భారత్ దృష్టికోణంలో ఆలోచించి, తాము ఇంతకుముందు ప్రతిపాదించిన సమయానికే ఇష్యూ జారీ చేయాలన్నది నా అభిలాష. అయితే అంతర్జాతీయ పరిణామాల రీత్యా తప్పదనిపిస్తే, ఐపీవో సమయాన్ని మార్చే అంశాన్ని మరోదఫా పరిశీలించడానికి వెనుకాడను’ అన్నారు.
ప్రపంచానికంతటికీ వివరించాలి
ప్రభుత్వపు వార్షిక డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలతో ముడిపడినందున, ఎల్ఐసీ ఐపీవో వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకోగలుగుతారా అని ప్రశ్నించగా, సీతారామన్ బదులిస్తూ ‘ఒక ప్రైవేట్ కంపెనీ ప్రమోటర్ ఈ నిర్ణయం తీసుకుంటే (ఐపీవోను వాయిదావేయడం) తన కంపెనీ బోర్డ్కు ఆ విషయం వివరిస్తే చాలు. కానీ నేనైతే ప్రపంచానికంతటికీ వివరించి చెప్పుకోవాలి’ అని వాపోయారు.