LIC IPO | త్వరత్వరగా ఐపీవోకు వెళ్లేందుకు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ముస్తాబుతున్నది. ఈ ఐపీవోలో పాలసీదారులకు ఎల్ఐసీ బంఫర్ ఆఫర్ ఇస్తోంది. ప్రతిపాదిత ఐపీవోలో పాల్గొనాలని భావించే పాలసీదారులు తమ పాన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ ఐపీవోలో 10 శాతం పాలసీ దారులకు రిజర్వ్ చేసింది. సంస్థ రికార్డుల్లో ఉన్న పాన్ నంబర్ అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఐపీవోలో పాల్గొనే చాన్స్ ఉంటుందన్నది.
పాలసీతో పాన్ నంబర్ లింక్ చేసిన తర్వాత మీకు కావాల్సింది డీమ్యాట్ ఖాతా. ఇప్పటికే డీమ్యాట్ ఖాతా ఉంటే పర్లేదు.. లేదంటే కొత్తగా తెరవాల్సిందే. ఈక్విటీ మార్కెట్లో షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. వీటిని ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ నిర్వహిస్తుంటాయి. ఆధార్, పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రం వంటి వివరాలతో డీమ్యాట్ ఖాతా తెరవొచ్చు. అయితే, వారు డీమాట్ ఖాతా కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ డీమాట్ ఖాతా లేకపోతే వారు సొంతంగా ఖాతా తెరవాలి. ఈ డీమాట్ ఖాతా తెరవడానికి అయ్యే ఖర్చును పాలసీదారులే భరించాలని పేర్కొంది. డీమ్యాట్ ఖాతా తెరిచాక ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు అర్హులవుతారు.
దేశంలోకెల్లా అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ ప్రక్రియకు గత జూలైలో కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఐపీవో ద్వారా ఎంత వాటాను విక్రయించాలన్న విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి సారధ్యంలోని కమిటీ ఖరారు చేస్తుంది. ప్రతిపాదిత ఐపీవోకు వెళ్లడానికి వీలుగా ఫైనాన్స్ యాక్ట్-2022 ద్వారా ఎల్ఐసీ చట్టంలో ఇప్పటికే కేంద్రం సవరణలు చేసింది. సెబీ నిబంధనలకు అనుగుణంగా తాజాగా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది.
స్టాక్ మార్కెట్లో కొన్నేండ్లుగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతున్నది. కొవిడ్ వేళ ఈ సంఖ్య మరింత పెరిగింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు యువత ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఎల్ఐసీ ఐపీవోకు వస్తుండడంతో మదుపర్లతోపాటు సగటు పాలసీదారులు సైతం ఐపీవోకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఎల్ఐసీ ఐపీవోతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.