న్యూఢిల్లీ, జనవరి 6: ఎల్ఐసీలో వాటాల విక్రయం కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) విధానాన్ని సవరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అభిప్రాయ సేకరణ తర్వాత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఎఫ్డీఐ పాలసీలో మార్పులు చేస్తున్నట్టు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రగతి శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ గురువారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ప్రస్తుత పాలసీతో ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కుదరదని, అందుకే త్వరగా సవరణలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఎఫ్డీఐ పాలసీని మరింతగా సరళీకరిస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్థిక సేవల శాఖతోపాటు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం)తో చర్చించామని చెప్పారు. వీలైనంత త్వరలోనే క్యాబినెట్ ఆమోదానికి వెళ్తామన్నారు.
ఎందుకీ సవరణలు?
ప్రస్తుత పాలసీ ప్రకారం దేశీయ బీమా రంగంలోకి ఆటోమేటిక్ మార్గం కింద 74 శాతం ఎఫ్డీఐకి అనుమతి ఉన్నది. అయితే ఎల్ఐసీకి ఇది వర్తించదు. ప్రత్యేక చట్టం ద్వారా ఎల్ఐసీ నడుస్తుండటమే దీనికి కారణం. అలాగే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూలో ఎఫ్డీఐ, ఎఫ్పీఐకి అనుమతి ఉన్నది. అయినప్పటికీ ఎల్ఐసీ ప్రత్యేక చట్టంలో ఇందుకు వీల్లేదు. దీంతో ఎల్ఐసీ ఐపీవోలో సెబీ నిబంధనలకు తగ్గట్టుగా విదేశీ మదుపరులు పాల్గొనేలా సవరణలు తీసుకువస్తున్నారు. కాగా, పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మోదీ సర్కారు వాటాల అమ్మకానికి దిగుతున్న విషయం తెలిసిందే. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)తో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎల్ఐసీ వస్తుండగా, 5-10 శాతం ఈక్విటీ విక్రయం ద్వారా రూ.80,000 కోట్ల నుంచి లక్ష కోట్లదాకా నిధులను అందుకోవచ్చని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను ఖజానాకు తరలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్య సాధనకు ఎల్ఐసీ ఐపీవోనే మార్గంగా కనిపిస్తున్నది. అందుకే ఈ మార్చిలోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను ఎలాగైనా తేవాలని ప్రభుత్వ వర్గాలు నిశ్చయించుకున్నాయి.