న్యూఢిల్లీ, ఆగస్టు 12: వివిధ కారణాలతో ఆగిపోయిన పాలసీలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పాలసీదారులకు కల్పిస్తూ ఎల్ఐసీ ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 21 మధ్య స్తంభించిన తమ వ్యక్తిగత ఎల్ఐసీ పాలసీలను కస్టమర్లు పునరుద్ధరించుకోవచ్చని ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం శుక్రవారం తెలిపింది.
ఈ ‘స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్’లో అన్ని నాన్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్) పాలసీలను రాయితీతో ఆలస్య రుసుము చెల్లించి కొనసాగించుకోవచ్చని ఎల్ఐసీ ఈ సందర్భంగా ప్రకటించింది. యులిప్ పాలసీలు మినహా మిగతా అన్ని పాలసీల పునరుద్ధరణ జరుగుతుందని పేర్కొన్నది.
అయితే పాలసీ షరతులకు లోబడే ఈ ప్రక్రియ నడుస్తుందని, బకాయిలు ఐదేండ్లలోపే ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ప్రీమియంల ఆధారంగా లేట్ ఫీజుల్లో గరిష్ఠ రాయితీ 25-30 శాతం లేదా రూ.2,500-3,500లుగా ఉండనున్నది. మైక్రో-ఇన్సూరెన్స్ పాలసీలకు లేట్ ఫీజు ఉండదు. అయితే మెడికల్ అవసరాల్లో ఎటువంటి రాయితీలుండవు. అనివార్య కారణాలతో, విపత్కర పరిస్థితుల మధ్య ప్రీమియంలు చెల్లించక పాలసీలను కొనసాగించలేకపోయిన వారందరికీ ఈ అవకాశం ఎంతో ప్రయోజనకరమని సంస్థ పేర్కొన్నది.
ఎల్ఐసీ నికరలాభం ఈ జూన్ త్రైమాసికంలో భారీగా పెరిగింది. కొత్త ప్రీమియం వసూళ్లు జోరుగా పెరగడంతో 2022 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో సంస్థ రూ. 682.89 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిరుడు ఇదే కాలంలో ఈ లాభం రూ.2.94 కోట్లే. సమీక్షాకాలంలో కొత్త ప్రీమియం వసూళ్లు రూ. 5,088 కోట్ల నుంచి రూ. 7,429 కోట్లకు చేరినట్లు ఎల్ఐసీ తెలిపింది.
ఆదాయం రూ. 1,54, 153 కోట్ల నుంచి రూ. 1,68, 881 కోట్ల కు పెరిగింది. 2022 మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం జూన్లో అన్ని విభాగాల్లోనూ ఎల్ఐసీ నిరుత్సాహకరమైన పనితీరును ప్రదర్శించింది. మార్చి క్వార్టర్లో రూ. 2,371 కోట్ల నికరలాభాన్ని నమోదుచేయగా, రూ. 14,614 కోట్ల కొత్త ప్రీమి యం వసూళ్లు జరిగాయి. రూ.2,11, 451 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.