న్యూఢిల్లీ, జూన్ 13: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ షేరు సోమవారం మరో 5.85 శాతం పతనమై రూ.668 వద్ద ముగిసింది. ఎల్ఐసీ షేరు దాని ఐపీవో ధర రూ.949కంటే 29.5 శాతం దిగువకు చేరడం గమనార్హం. యాంకర్ ఇన్వెస్టర్లు ప్రీ ఐపీవో ముందు పొందిన షేర్లకు లాకిన్ పిరియడ్ సోమవారం ముగియడంతో అమ్మకాలు వెల్లువెత్తినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు 5.93 కోట్ల ఎల్ఐసీ షేర్ల కేటాయింపు జరిగింది. 30 రోజుల లాకిన్ తర్వాత వారు స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చు.
ఆసియాలో ఫ్లాప్ ఐపీవోల్లో రెండోది
ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన ఆసియా కంపెనీల్లో రెండో అతిపెద్ద పతనాన్ని ఎల్ఐసీ మూటగట్టుకుంది. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ లిస్టయిన అనంతరం 30 శాతం నష్టాన్ని చవిచూడగా, ఎల్ఐసీ 29.5 శాతం క్షీణతతో ద్వితీయస్థానంలో ఉంది.