LIC IPO | పాలసీదారులతోపాటు దేశంలోని 75 లక్షల నుంచి కోటి మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ ఐపీవోలో బిడ్లు దాఖలు చేస్తారని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) అంచనా వేస్తున్నది. దేశంలోని ఇన్వెస్టర్లలో ఏడో వంతైనా పాల్గొంటారని భావిస్తున్నది. దేశ క్యాపిటల్ మార్కెట్స్ చరిత్రలో నాన్ ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చునని సమాచారం. ఒక్కొక్కరు 30-40 వేల షేర్లకు బిడ్లు వేస్తారని భావిస్తున్నారు. దీనిపై స్పందించడానికి ఎల్ఐసీ అందుబాటులోకి రాలేదు.
వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో డీమ్యాట్ ఖాతాలు 7.38 కోట్లు ఉన్నాయని ప్రభుత్వ అంచనా. దాదాపు ప్రతి డీమ్యాట్ ఖాతాదారు వద్దకు ఐపీవోను తీసుకెళ్లాలని ఎల్ఐసీ వ్యూహాలు రూపొందిస్తున్నది. ఎల్ఐసీ ఐపీవో వచ్చే నాటికి దేశంలో డీమ్యాట్ ఖాతాదారుల సంఖ్య ఎనిమిది కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. వచ్చేనెలాఖరు నాటికి ఎల్ఐసీ ఐపీవో ముగుస్తుంది.
దేశమంతా భారీ సంఖ్యలో ప్రజలు చురుగ్గా ఐపీవోలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చురుగ్గా ప్రయత్నాలు సాగిస్తున్నారు. గరిష్ఠ స్థాయిలో రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, లోకల్ బ్రోకర్లు, ఏజెంట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది మార్చి నెలాఖరు నాటికి ఎల్ఐసీకి 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. 1.14 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.