న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ప్రభుత్వ సంస్థ అంటే ఓ భద్రత.. సర్కారీ కొలువంటే ఓ భరోసా.. కానీ ఆ భద్రత, భరోసాలకు తూట్లు పొడుస్తూ ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్పరం చేస్తున్నది. దీంతో కడుపు రగిలిపోతున్న ఉద్యోగులు నిరసన బాట పడుతున్నారు. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలను మే 4న కేంద్రం అమ్మకానికి పెడుతున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఆ సంస్థ ఉద్యోగులు అదే రోజున విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ), అఖిల భారత ఎల్ఐసీ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎల్ఐసీఈఎఫ్) సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 80వేల మంది ఎల్ఐసీ 3, 4 తరగతుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
ప్రభుత్వ తీరును ఎండగడతాం
ఎల్ఐసీలో వాటాలను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా సంస్థ విలువనే తగ్గించడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఏఐఐఈఏ ఉపాధ్యక్షుడు ఏకే భట్నాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతూ దేశంలోని ప్రతీ ఎల్ఐసీ శాఖ స్థాయిలో తమ అసోసియేషన్ సభ్యులు ఉద్యోగులనేగాక పాలసీదారులను, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టనున్నారని చెప్పారు. ఎల్ఐసీ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కించి 3.5 శాతం వాటాను అమ్మాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మే 4-9 మధ్య పబ్లిక్ ఇష్యూకు వస్తుండగా, తద్వారా రూ.21,000 కోట్ల నిధులను చేజిక్కించుకోవాలని చూస్తున్నది. నిజానికి అంతకుముందు రూ.16 లక్షల కోట్లుగా ఎల్ఐసీ విలువను అంచనా వేయడం గమనార్హం. దీంతో ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు బాగాలేవని, అయినప్పటికీ ఖజానాకు ఎలాగైనా నిధులను తరలించాలనే ఎల్ఐసీ విలువను ఇంతగా తగ్గించారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయిప్పుడు.
ఎల్ఐసీ విలువ తగ్గించడంపై..
నిధుల సమీకరణే లక్ష్యంగా పెట్టుకుని, సంస్థ ప్రయోజనాలను కాలరాస్తూ పబ్లిక్ ఇష్యూ కోసం ఎల్ఐసీ విలువను తగ్గించారని ఉద్యోగ సంఘాలు కేంద్రం తీరుపై మండిపడుతున్నాయి. ఈ చర్యను పాలసీదారులు, దేశ ప్రజలకు జరిగిన తీవ్ర నమ్మకద్రోహంగా పేర్కొంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థతో ఎల్ఐసీకి విడదీయరాని అనుబంధం ఉన్నదని, జాతి అభివృద్ధికి 65 ఏండ్లుగా సంస్థ కృషి చేస్తున్నదని ఉద్యోగ సంఘాలు గుర్తుచేశాయి. సంస్థకు నిజమైన యజమానులు పాలసీదారులేనన్న ఏఐఐఈఏ.. కేంద్రం ఒంటెత్తు పోకడను తీవ్రంగా ఖండించింది. దీన్ని నిరసిస్తూనే బుధవారం 2 గంటలపాటు విధులకు దూరంగా ఉంటామని ప్రకటించింది. కాగా, ఏఐఐఈఏ, ఏఐఎల్ఐసీఈఎఫ్లు ఎల్ఐసీలోని ఫీల్డ్ ఏజెంట్లు మినహా దాదాపు మిగతా ఉద్యోగులందరికీ ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.