హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణానికి స్కైరూట్ ప్రణాళికలను రూపొందిస్తున్నదని ఆ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు పవన్కుమార్ చందన తెలిపారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న టై గ్లోబల్ సమ్మిట్-2022లో ‘సైరూట్ జర్నీ అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్’ అనే అంశంపై మంగళవారం ఆయన ప్రసంగించారు. ‘నేడు మనకు రాకెట్ ప్రయోగాలు గతంలో కంటే ఎకువగా అవసరం.
అంతరిక్ష సాంకేతికత లేకుండా మనం జీవించలేము. జీపీఎస్ మొదలుకొని చేపల పెంపకాన్ని నావిగేట్ చేసే మత్స్యకారుల వరకు మనందరికీ ఈ సాంకేతికత అవసరం. ప్రతి నిమిషానికి ఒక రాకెట్ ప్రయోగం జరిగే రోజు ఇంకెంతో దూరంలో లేదు’ అన్నారు. కాగా, తమ స్టార్టప్ను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించిందని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు టీ-హబ్కు విచ్చేసి తమ స్టార్టప్ లోగోతో కూడిన దుస్తులను ధరించడం, మమ్మల్నీ ప్రోత్సహించడం ఎప్పటికీ మరువలేమన్నారు. ‘మా నాలుగేండ్ల ప్రయాణంలో ఇదొక అద్భుతమని చెప్పవచ్చు.
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్లో స్కైరూట్ సాధించిన విజయాన్ని, భవిష్యత్తులో చేయాల్సిన లక్ష్యాలను చెప్పారు. ఓ స్టార్టప్ సాధించిన విజయానికి దేశం మొత్తం సంబురాలు చేసుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉన్నది’ అన్నారు. గత నెల 18న జరిగిన దేశీయ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ రాకెట్ను స్కైరూటే నిర్మించింది. మొత్తానికి హైదరాబాద్ కేంద్రంగా టీ-హబ్లో ఒక స్టార్టప్గా ప్రారంభమైన స్కైరూట్ జర్ని.. అంతరిక్ష రంగంలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఔత్సాహిక స్టార్టప్ల వ్యవస్థాపకులకు, వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు స్కైరూట్ విజయగాథను తెలియజేసేందుకు టై గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.