Legal Notice IT Dept | ఆదాయం పన్నుశాఖ (ఐటీ శాఖ)కు సారధ్యం వహిస్తున్న కేంద్ర ప్రత్యక్ష బోర్డుల మండలి (సీబీడీటీ) లీగల్ నోటీసు జారీ అయింది. ఇది జారీ చేసింది అఖిల ఒడిశా టాక్స్ అడ్వకేట్ల సంఘం (ఏవోటీఏఏ). 2020-21 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగించనందుకు ఒడిశా టాక్స్ అడ్వకేట్ల సంఘం ఈ నోటీసు జారీ చేసింది. ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన పోర్టల్లో పలు సాంకేతిక లోపాలు తలెత్తాయని, కనుక ఐటీఆర్ దాఖలు గడువు పొడిగించనందుకు ఆ చట్టంలోని 234 ఎఫ్ సెక్షన్ కింద ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపింది.
తాము జారీ చేసిన లీగల్ నోటీసు అందుకున్న తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించకుంటే ఒడిశా హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని కూడా ఐవోటీఏఏ స్పష్టం చేసింది. ఐటీఆర్ గడువు పెంపునకు ఐటీశాఖను ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఈ నెల నాలుగో తేదీన జారీ చేసిన లీగల్ నోటీసులో వెల్లడించింది.
పాత ఇన్కం టాక్స్ పోర్టల్లో సమస్యలు ఉన్నప్పటికీ యూజర్ ఫ్రెండ్లీగా ఉందని ఐవోటీఏఏ వ్యాఖ్యానించింది. కానీ 2021-22 ప్రారంభమైన తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఇన్ఫోసిస్కు కొత్త పోర్టల్ రూపకల్పన కాంట్రాక్ట్ అప్పగించింది. కానీ నూతన పోర్టల్లో సమస్యల కారణంగా చాలా మంది ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారని ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీఆర్ వివరాలు నమోదు చేస్తున్న సమయంలో సిస్టం హ్యాంగవుతూ వచ్చిందని పేర్కొంది. డిసెంబర్ నెలాఖరులోగా ఐటీఆర్ దాఖలు చేయడానికి పలు కష్టాలు పడ్డామని తెలిపింది.