వాషింగ్టన్, సెప్టెంబర్ 8: ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ వ్యాపార సంస్థ స్టార్బక్స్కు ఇటీవల సీఈవోగా ఎన్నికైన లక్ష్మణ్ నరసింహన్ ఏటా గరిష్ఠంగా రూ.140 కోట్ల జీతం అందుకోనున్నారు. అయితే తన లక్ష్యాలను సాధిస్తేనే ఈ మొత్తం దక్కనున్నది. భారత సంతతికి చెందిన లక్ష్మణ్.. ఇంతకుముందు రెకిట్ బెన్కిసర్ సీఈవోగా రూ.55 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి స్టార్బక్స్ సారథ్య బాధ్యతలను లక్ష్మణ్ చేపట్టనున్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1న సంస్థ బోర్డులోకి వెళ్లనున్నారు. అప్పటిదాకా ప్రస్తుతం స్టార్బక్స్కు మధ్యంతర సీఈవోగా ఉన్న హోవర్డ్ షల్ట్తో కలిసి పనిచేయనున్నారు. గతంలో పెప్సికోలోనూ ఉన్నత హోదాల్లో పనిచేసిన లక్ష్మణ్కు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థల్లో 30 ఏండ్లు పనిచేసిన అనుభవం ఉన్నది. పుణె విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన లక్ష్మణ్.. జర్మనీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లోనూ ఉన్నత విద్యనభ్యసించారు.