SBI | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ – భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచేసింది. రూ.2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లు, రూ.2 కోట్ల పై చిలుకు బల్క్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లు సవరించింది. సవరించిన వడ్డీరేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని తన వెబ్సైట్లో వెల్లడించింది.
రూ.2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై ఎస్బీఐ గరిష్టంగా 75 బేసిక్ పాయింట్ల మేరకు ఎస్బీఐ వడ్డీ పెంచివేసింది. 46 రోజుల నుంచి 179 రోజుల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.75 శాతం నుంచి 5.50 శాతానికి వడ్డీ పెరిగింది. సీనియర్ సిటిజన్లకు 5.25 నుంచి 6 శాతానికి పెరిగింది.
180-210 రోజుల గడువు గల ఫిక్స్ డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు ఆరు శాతం, సీనియర్ సిటిజన్లకు 6.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. 211 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు ఆరు నుంచి 6.25 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతానికి పెంచింది.
మరోవైపు బల్క్ డిపాజిట్లపై ఏడు రోజుల నుంచి 45 రోజులకు 25 బేసిక్ పాయింట్ల మేరకు వడ్డీ పెంచింది. ప్రస్తుతం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ ఐదు శాతం కాగా, తాజాగా 5.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. 46-179 రోజుల గడువు గల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 50 బేసిక్ పాయింట్లు పెంపుతో 5.75 నుంచి 6.25 శాతానికి వడ్డీ పెరిగింది. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.