Interest Rates | హైదరాబాద్, ఫిబ్రవరి 7: దాదాపు రెండేండ్ల నుంచి పెరుగుతూ వచ్చిన వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం లేదని, గరిష్ఠ వడ్డీ రేటుపై ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేయడానికి ఇదే చివరి ఛాన్స్ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాల్ని గవర్నర్ శక్తికాంత్ దాస్ ఫిబ్రవరి 8న వెల్లడించనున్న నేపథ్యంలో నిపుణులు వారి అంచనాల్ని వివరించారు. గురువారం నాటి పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెడుతుందని, కానీ ఇదే తీరు ఎక్కువ కాలం కొనసాగబోదని అన్నారు.
తదుపరి రోజుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నందున, ఎఫ్డీలపై అధికవడ్డీ ఆశించేవారికి ఇదే తగిన తరుణం అని చెప్పారు. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా బ్యాంకులు వాటి డిపాజిట్, రుణ రేట్లను నిర్ణయించుకుంటాయి. రెపోను పెంచినపుడు ఎఫ్డీ రేట్లను పెంచడం, తగ్గించినపుడు కోత పెట్టడం చేస్తుంటాయి. వరుసగా పలు దఫాలు 250 బేసిస్ పాయింట్ల (2.5 శాతం) మేర రెపో రేటును పెంచిన ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి అదేస్థాయి వద్దే కొనసాగిస్తున్నది. ఇప్పుడది 6.5 శాతం ఉంది.
ప్రస్తుతానికి ఆర్బీఐ యథాతథ వడ్డీ రేట్ల పాలసీని కొనసాగించినా, విధాన వైఖరిని వెల్లడించే పదం ద్వారా రేట్లు త్వరలో తగ్గుతాయా? లేక తగ్గవా అనే అంశంపై ఒక అంచనాకు రావచ్చని విశ్లేషకులు చెపుతున్నారు. గురువారం నాటి సమీక్షలో రిజర్వ్బ్యాంక్ రేట్లు, వైఖరి..రెండింటినీ మార్చబోదని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ చెప్పారు. అధిక ద్రవ్యోల్బణంతో ఆర్బీఐ ఆందోళన చెందుతున్నదని, ఇది తగ్గుముఖం పడుతుందన్న అంచనాలకు వస్తే కేంద్ర బ్యాంక్ తన వైఖరిని మార్చుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ పేర్కొంది. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠస్థాయి 5.7 శాతాన్ని అందుకోవడంతో పాటు ఆహారోత్పత్తుల ధరలు రెండంకెల్లో పెరిగాయి.
ఇటీవలి పాలసీ ప్రకటనలో ఆర్బీఐ ‘విత్డ్రాయిల్ ఆఫ్ అకామిడేషన్’ అనే పదం వాడుతున్నది. అంటే సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరిస్తున్నామని చెప్పడం. దీనిని తాజా ఎంపీసీ సమీక్షలో ‘న్యూట్రల్’ మార్పుచేస్తే, అధిక వడ్డీ రేట్లు ఇక ఉండవన్న సంకేతాలు ఇవ్వడమే. మార్చి మధ్యనాటికల్లా రబీ పంట మార్కెట్లోకి రావడంతో ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పడతాయని, మరోవైపు ఆర్థికాభివృద్ధికి సైతం ఊతం అందించాల్సి ఉన్నందున ఫిబ్రవరి పాలసీ సమీక్షలో ఆర్బీఐ తన వైఖరిని ‘న్యూట్రల్’లోకి మార్చుకుంటుందని అంచ నా వేస్తున్నట్టు కేర్ ఎడ్జ్ వివరించింది.
రుణ డిమాండ్కు తగ్గ డిపాజిట్ల వృద్ధి కొరవడటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యత తక్కువగా ఉన్నదని, దీంతో త్వరలో స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెరిగినప్పటికీ, దీర్ఘకాలిక ఎఫ్డీలకు ఇప్పటికే గరిష్ఠ రేట్లు అని, మరింత పెరిగే అవకాశం లేదని ఫిజ్డమ్ రీసెర్చ్ అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది మధ్య నుంచి ప్రపంచ దేశాల్లో కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్లను తగ్గిస్తాయన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి. జనవరి పాలసీ సందర్భంగా యూఎస్ ఫెడ్ 2024లో మూడు దఫాలు వడ్డీ రేట్ల కోతలు ఉంటాయని సూచించింది.
ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిజర్వ్బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. అప్పటికి ద్రవ్యోల్బణం సైతం 4 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. ఇదే అభిప్రాయాన్ని ల్యాడర్అప్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ రాఘవేంద్ర నాథ్ వ్యక్తం చేస్తూ యూఎస్ ఫెడ్ రేట్ల కోత ప్రారంభించినపుడు ఆర్బీఐ సైతం ఊరటచెందుతుందని, రుతుపవనాలు సాధారణంగా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రేట్లు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. రేట్ల తగ్గింపు కనుచూపు మేరలోనే ఉన్నదని ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ అభిషేక్ కుమార్ అంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు అంచనాల్ని తగ్గించడం, వచ్చే ఏడాదికి మరింత కుదించడంతో రెపో రేటును దించడం ఎంపీసీకి సులభం అవుతుందని చెప్పారు.