Hyderabad Metro | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తమ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫైనాన్షియల్స్ మెరుగైన తర్వాత విక్రయిస్తామని లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శంకర్రామన్ తెలిపారు. ఒక అంగ్ల దినపత్రికతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగల కొనుగోలుదార్లు ఉన్నప్పటికీ, వారు మెట్రో ప్రస్తుత నగదు రాబడి ఆధారంగా విలువను ఆఫర్ చేస్తున్నారని, అది ఎల్ అండ్ టీ అంచనాలకు తగినట్టు లేదని వివరించారు. ఎల్ అండ్ టీ తన నాన్-కోర్ ఆస్తులైన హైదరాబాద్ మెట్రోను, పంజాబ్లోని నభా పవర్ ప్లాంట్ను 2021లో అమ్మకానికి పెట్టింది.
తగిన విలువ లభ్యంకాకపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టు బ్యాలన్స్ షీట్ను మెరుగుపర్చడంపై దృష్టినిలిపింది. ప్రయాణీకుల సంఖ్యను పెంచుకోవడం తదితర అంశాల కోసం ప్రణాళికల్ని అమలు చేస్తున్నామని, ఒక ఏడాది తర్వాత విక్రయానికి తగ్గరీతిలో ఫైనాన్షియల్స్ మెరుగుపడతాయని భావిస్తున్నామని సీఎఫ్వో తెలిపారు.
ఇప్పుడు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ద్వారా ప్రయాణించేవారి సంఖ్య రోజుకు 5 లక్షలు దాటింది. మరోవైపు ప్రాజెక్టుకు ఉన్న రుణ భారాన్ని తగ్గించేదిశగా కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం రూ. 3,000 కోట్ల వడ్డీ రహిత రుణాన్ని ఇచ్చింది. రుణాన్ని తగ్గించుకునేందుకు ప్రాజెక్టులో భాగంగా ఉన్న 18.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంగల స్థలాల్ని నగదు చేయాలని ఎల్ అండ్ టీ భావిస్తున్నది. ఈ ప్రాజెక్టుకు ఉన్న అధిక రుణాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని శంకర్రామన్ చెప్పారు. రాబడులకు దీర్ఘకాలం వేచిచూస్తే సావరిన్ వెల్త్ ఫండ్స్, ఎల్ఐసీ, ఇతర బీమా కంపెనీలకు ఈ ప్రాజెక్టు గిట్టుబాటు అవుతుందని అన్నారు.