న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దేశంలో తయారయ్యే సెమీకండక్టర్లు.. ల్యాప్టాప్ల ధరను భారీగా తగ్గిస్తాయని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. భారత్లోనే గ్లాస్, సెమీకండక్టర్లు తయారైతే ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయలున్న ల్యాప్టాప్ను రూ.40 వేలకే కొనుక్కోవచ్చని చెప్పారు.
‘నేడు తైవాన్, కొరియాల్లో ఉత్పత్తి అవుతున్న గ్లాస్.. అతి త్వరలోనే భారత్లోనూ తయారవుతుంది’ అంటూ బుధవారం ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్తో మాట్లాడుతూ అగర్వాల్ తెలిపారు. ఫాక్స్కాన్తో కలిసి వేదాంత సెమీకండక్టర్ల ప్లాంట్ పెడుతున్న నేపథ్యంలో దేశీయంగా ల్యాప్టాప్లతోపాటు మొబైల్ ఫోన్లు, ఈవీలనూ తయారు చేస్తామని వెల్లడించారు. కాగా, వచ్చే రెండేండ్లలో ఉత్పత్తికి ఈ ప్లాంట్ సిద్ధమవుతుందన్న ఆశాభావాన్ని అనిల్ అగర్వాల్ వ్యక్తం చేశారు. యాపిల్ ఫోన్ల తయారీలో ఫాక్స్కాన్ టెక్నాలజీనే కీలకమన్నది విదితమే.