న్యూఢిల్లీ, ఆగస్టు 4: దేశంలోకి ల్యాప్టాప్ దిగుమతులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో యాపిల్, సామ్సంగ్, హెచ్పీ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థలు.. భారత్కు ల్యాప్టాప్లను దిగుమతి చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి మరి. ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు తదితర కమ్యూనికేషన్ ఆధారిత ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై గురువారం కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. లైసెన్స్, ఇతరత్రా అనుమతుల్ని తప్పనిసరి చేసిన సంగతీ విదితమే. అయితే తక్షణమే ఇవి అమల్లోకి రావడంతో ఇప్పటిదాకా దేశీయ మార్కెట్లో సదరు ఉత్పత్తులను విక్రయిస్తూ వస్తున్న విదేశీ కంపెనీల దిగుమతులకు ఒక్కసారిగా బ్రేకులుపడ్డాయి.
కేంద్రంతో చర్చలు..
ఆకస్మిక లైసెన్స్ నిబంధనల నేపథ్యంలో ఆగిపోయిన ల్యాప్టాప్, స్మాల్ ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతుల్ని పునరుద్ధరించుకొనేందుకు ప్రముఖ టెక్నాలజీ కంపెనీలన్నీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపుల్ని సాగిస్తున్నాయిప్పుడు. త్వరగా లైసెన్స్ పొందడం ఎలా? అన్న కోణంలో ఆరా తీస్తున్నాయి. అయితే ప్రభుత్వ లక్ష్యం, ఉద్దేశం ఏదైనా.. తాజా నిర్ణయంతో పరిశ్రమ చిక్కుల్లో పడిందని, ఈ తరహా దుందుడుకు నిబంధనలు, విధానాలు సరికావన్న అభిప్రాయాన్ని పలు సంస్థల ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంపై అటు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖగానీ.. ఇటు యాపిల్, సామ్సంగ్, హెచ్పీ కంపెనీల ప్రతినిధులుగానీ స్పందించేందుకు నిరాకరిస్తున్నారు.
లావాదేవీలు ఎక్కడివక్కడే..
భారతీయ మార్కెట్లో ల్యాప్టాప్సహా ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లకు విపరీతమైన డిమాండ్ ఎప్పుడూ ఉండనేఉంటుంది. ప్రధానంగా పండుగ సీజన్లో వీటి అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతాయి. దీంతో రాబోయేది పండుగ సీజనే కావడంతో కేంద్రం తెచ్చిన ఆంక్షల మధ్య అటు కంపెనీలు, ఇటు వ్యాపారులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు నడుస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ల్యాప్టాప్, పీసీల కోసం మార్కెట్కు వస్తున్నారని, ఉద్యోగుల నుంచీ డిమాండ్ కనిపిస్తున్నదని, దీపావళి షాపింగ్ ప్రభావితం కావచ్చేమోనన్న భయాలను ఇండస్ట్రీ వర్గాలు వెలిబుచ్చుతున్నాయి. ఇప్పటికే వేల కోట్ల రూపాయల్లో వాణిజ్యం స్తంభించిపోయిందని అంటున్నారు.
ఆంక్షల అమలు గడువు పొడిగింపు?
ల్యాప్టాప్లు, ఇతర డివైజ్ల దిగుమతికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకొనేందుకు సంబంధిత కంపెనీలకు ప్రభుత్వం మరింత సమయం ఇచ్చే అవకాశాలున్నాయని కేంద్ర సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే దిగుమతి ఆంక్షలను పొడిగించే వీలూ లేకపోలేదంటున్నాయి. ఈ మేరకు డీజీఎఫ్టీ నుంచి త్వరలోనే ఓ నోటిఫికేషన్ రావచ్చన్న అంచనాలు వారి నుంచి వినిపిస్తున్నాయి.
మార్కెట్ ఆగమాగమే..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం.. దేశీయ మార్కెట్ వృద్ధికి విఘాతం కలిగించేదేనని మెజారిటీ పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా భారత్లో తయారీకి కొత్త తలనొప్పులు రావచ్చని అంటున్నారు. దిగుమతులపై ఆంక్షలు రావడంతో దేశంలోకి కొత్త సరకు రాక, ఇప్పటికే ఉన్న సరకు చాలక.. ల్యాప్టాప్, పర్సనల్ కంప్యూటర్ల తయారీ ఆగిపోతుందని, దీంతో డిమాండ్కు తగ్గ సరఫరా లేక మార్కెట్లో ధరలు పెరిగిపోవచ్చని చెప్తున్నారు. ఇక కృత్రిమ కొరత తలెత్తితే ధరలు అమాంతం పెరిగిపోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని కనబరుస్తున్నారు. ఇక మార్కెట్లో నెలకొనే పరిస్థితులు అటు వినియోగదారులను, ఇటు వ్యాపారులను నష్టపర్చకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) సహ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాత్సవ సూచించారు.