న్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)లో తన వాటాను ప్రభుత్వం లేదా ప్రభుత్వం చెప్పిన ఏదైనా సంస్థకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పడం గమనార్హం. ఈ కంపెనీ కొనసాగాలన్న ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు గత జూన్లోనే ఆయన ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తాజాగా వెల్లడైంది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు బిర్లా ఈ లేఖ రాశారు. అధికారిక లెక్కల ప్రకారం.. వీఐఎల్ అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) లయబిలిటీ రూ.58,254 కోట్లుగా ఉంది. ఇందులో సంస్థ ఇప్పటికే రూ.7,854 కోట్లు చెల్లించగా.. ఇంకా రూ.50,399 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఈ ప్రభుత్వ అంచనాలను సవరించాలని కోరుతూ వీఐఎల్, భారతీ ఎయిర్టెల్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. వీఐఎల్లో కుమార మంగళం బిర్లాకు 27 శాతం వాటా ఉంది. ఏజీఆర్ లయబిలిటీపై స్పష్టత లేక ఇన్వెస్టర్లు తమ కంపెనీలో పెట్టుబడి పెట్టడం లేదని బిర్లా ఆ లేఖలో చెప్పారు. దీంతోపాటు మరో రెండు అంశాలను కూడా లేవనెత్తారు. వీటిపై వెంటనే ప్రభుత్వ మద్దతు లేకపోతే వీఐఎల్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి, పూర్తిగా పతనమయ్యే ప్రమాదం ఉన్నదని జూన్ 7న రాసిన ఈ లేఖలో బిర్లా స్పష్టం చేశారు. 27 కోట్ల కస్టమర్లు ఉన్న వీఐఎల్ సంస్థను బతికించుకునేందుకు తన వాటాను ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా అందులో చెప్పారు. ఆ లేఖ తర్వాత ప్రభుత్వం ఏమైనా స్పందించిందా, బిర్లాతో చర్చలు జరిగాయా అన్నదానిపై స్పష్టత లేదు.