వరంగల్, మే 7(నమస్తే తెలంగాణ): వరంగల్లో ప్రతిష్ఠాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం జరుగుతుండటం తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ మెగా పార్కుతో బహుళ లాభాలున్నాయని, వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. తొలుత గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద సుమారు 1,300 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించారు. ఇక్కడ 187 ఎకరాల్లో కిటెక్స్ కంపెనీ వస్త్ర పరిశ్రమల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.
పార్కుకు రూ.100 కోట్లతో మిషన్ భగీరథ నీటి సరఫరా పనులకూ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈ పార్కులో వస్త్ర పరిశ్రమల స్థాపన కోసం దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన 263 ఎకరాలను, కంపెనీ ప్రాజెక్టు డిజైన్లను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఆయన పరిశీలించారు. ఇప్పటికే ఈ పార్కులో గణేశ ఎకో స్పేర్ లిమిటెడ్ కంపెనీ నిర్మించిన వస్త్ర పరిశ్రమలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో జరిగిన టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పత్తి దేశంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినదన్నారు. ఈ విషయాన్ని వస్త్ర పరిశ్రమల పెద్దలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు చెప్పారని గుర్తుచేశారు.
వరంగల్లో అజంజాహి మిల్లు మూతపడిన తరుణంలో ఎలాగైనా ఒక పెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఈ మెగా పార్కు నిర్మాణానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఈ పార్కు నిర్మాణానికి ఇద్దరే కారణమని, ఒకరు సీఎం కేసీఆరైతే, మరొకరు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సూచనతో చల్లా.. పార్కు కోసం 1,300 ఎకరాల భూమిని సేకరించారని, ఆయన పట్టుదల వల్లే పార్కు నిర్మాణం జరుగుతున్నదని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కిటెక్స్ కంపెనీ.. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అని, ఈ కంపెనీ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కిటెక్స్ కంపెనీ ఇక్కడ రూ.1,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని, తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. యంగ్వన్ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాతిగలదన్నారు. ఇక్కడ రూ.1,100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని, 10 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలియజేశారు. ఈ కంపెనీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 8-11 యూనిట్లను పెడుతుందన్నారు. గణేశ ఇకో స్పేర్ లిమిటెడ్ కంపెనీ ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి దారం తయారు చేసే వస్త్ర పరిశ్రమలను నిర్మించిందన్నారు. ఈ పార్కులో మొదలైన తొలి సంస్థ ఇదే. ఇక్కడ రాబోయే 18 నెలల్లో 25 యూనిట్ల నుంచి ఉత్పత్తి జరగనుందని, ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు బహుళార్దక లాభాలను ఇచ్చేదని, తెలంగాణ రాష్ర్టానికే ఇది గర్వకారణమని తెలిపారు. ఇంత పెద్ద పార్కు పెట్టాలని ప్రధాని మోదీకి కూడా ఆలోచన రాలేదని విమర్శించారు.
వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కేటీఆర్ చెప్పారు. వరంగల్కు ఉన్న ప్రత్యేకతలతో ఇక్కడ ఈ రంగం విస్తరిస్తుందని తెలిపారు. ద్వితీయశ్రేణి నగరాలలో వచ్చే ఐదేండ్లలో ఐటీ రంగంలో 50 వేల మందికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. వరంగల్కు చెందిన రవిచంద్ర సాఫ్ట్పాత్ కంపెనీతో హైదరాబాద్లో, అమెరికాలో సాఫ్ట్వేర్లో స్థిరపడ్డారని.. ఇటీవల తాను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ కలిసి వరంగల్లో తన సంస్థ కార్యకలాపాల గురించి చెప్పారని వివరించారు. సాఫ్ట్పాత్ కంపెనీ వరంగల్లో ఏడాది క్రితం 250 మందితో నిర్వహిస్తున్నారని, రెండేండ్లలో వెయ్యి మంది ఇక్కడ పనిచేసేలా ఈ సంస్థ విస్తరిస్తుందని చెప్పారు. మైండ్ట్రీ, జెన్ప్యాక్ట్, టెక్ మహీంద్రా, సైయెంట్, క్వాడ్రంట్ వంటి కంపెనీలు ఇప్పటికే వరంగల్లో కార్యకలాపాలను మొదలుపెట్టాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఖిలా వరంగల్ మండలంలోని మామునూరు ఎయిర్పోర్టును మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఎయిర్పోర్టును పరిశీలించి దీనికి స్థల సేకరణపై అధికారులతో మాట్లాడారు. ఇక్కడి నుంచి సమీపంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో అరూరి గట్టుమల్లు పౌండేషన్ ఉద్యోగార్థులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని కూడా మంత్రి కేటీఆర్ సందర్శించారు. మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని కేటీఆర్ చెప్పారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించామని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ దీనికి హాజరయ్యారన్నారు. ‘మంత్రులు దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించాం. ఎయిర్పోర్టులో ప్రస్తుతం 1,800 మీటర్ల రన్వే ఉంది. దీన్ని 3,900 మీటర్లకు పెంచాలి. రన్వే విస్తరణ కోసం మరో 300-400 ఎకరాలను సేకరించాలి. టెర్మినల్ భవనాన్ని అక్కడినుంచి మార్చాల్సి ఉంది. ఢిల్లీలో అనుమతి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తుంది’ అని కేటీఆర్ వివరించారు.
టెక్స్టైల్ పార్కుతో వరంగల్కు పూర్వవైభవం వస్తుందని కేటీఆర్ అన్నారు. నిజాం హయాంలో నిర్మించిన అజంజాహీ మిల్స్తో ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి ఉండేదన్నారు. సమైక్య ప్రభుత్వాలు దీన్ని మూసివేయడంతో ఇక్కడివారు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును వరంగల్లో ఏర్పాటు చేసుకుంటున్నామని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుతో ఈ రంగంలో వరంగల్కు పూర్వవైభవం వస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా ఈ టెక్స్టైల్ పార్కు పూర్తయితే వరంగల్లో ఉపాధి అవకాశాల పరంగా పాత రోజులు వస్తాయని చెప్పారు. నిజానికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇప్పటికే పూర్తికావాల్సి ఉందని, కరోనా వల్ల వస్త్ర వ్యాపారం సంక్షోభంలో పడటంతో రెండున్నరేండ్లు అడ్డంకులు ఏర్పడ్డాయని చెప్పారు. మరో ఏడాదిన్నరలో టెక్స్టైల్ పార్కులో 20 వేల మందికి ఉపాధి కలుగుతుందని, వీరిలో ఎక్కువమంది మహిళలు ఉంటారని తెలిపారు.
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా గతంలో ఉపాధి కోసం వలసపోయిన చేనేత కార్మికులు తిరిగి వచ్చేలా, దేశానికి తలమానికంగా ఉండేలా టెక్స్టైల్ పార్కు రూపుదిద్దుకుంటుందని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి దీకి నయాపైసా రాలేదని పేర్కొన్నారు. టెక్స్టైల్ పార్కుకు కేంద్రం నిధులు ఇస్తుందనే ఆశ లేదని… కేంద్రం నిధులు ఇస్తేనే తాను ఆశ్చర్యపోతానని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇక్క కాలేజీని ఇవ్వలేదని చెప్పారు. ఐఐఎం, ఐఐటీ, మెడికల్ కాలేజీలో ఒక్కటీ మనకు మంజూరు చేయలేదని పేర్కొన్నారు.