మస్కట్ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 5 : మేథో సంపత్తి హక్కులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘ఐపీ బడ్డీ-రచిత్’ మస్కట్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య సహకారంతో రిజల్యూట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐపీ4ఆల్ పేరుతో ఈ వేదికను ఏర్పాటు చేసింది. సృజనాత్మకత, ఆవిష్కరణలకు సంబంధించిన మేథో సంపత్తి హక్కుల రక్షణకు ఈ వేదిక కృషి చేయనున్నది. మేథో సంపత్తి హక్కులపై విద్యార్థులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు, ఇతర భాగస్వాములకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ గత డిసెంబర్ 8న జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించినది తెలిసిందే. దీనిలో భాగంగా 8-12 తరగతులకు చెందిన 10 లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఐపీ బడ్డీ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మార్చి నెలాఖరు నాటికి 10 వేల మందికి ఐపీ అంబాసిడర్లుగా సర్టిఫికెట్లు ప్రదానం చేయాలని నిర్ణయించారు. దీనికోసం 8341110413 వాట్సప్ నంబర్ను విడుదల చేశారు. మేథో సంపత్తి హక్కులపై ఎటువంటి సందేహాలున్నా దీనికి సంప్రదించవచ్చని రిజల్యూట్ తెలిపింది.