హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం ప్రత్యేకంగా ఓ క్లస్టర్ను ఏర్పాటుచేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. ఈ క్లస్టర్లో దాదాపు 500 ఎంఎస్ఎంఈలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. అంతేగాకుండా ఎంఎస్ఎంఈలను నష్టాల్లో నుంచి బయటపడేసేందుకు మరెక్కడా లేనివిధంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని తెచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణే అని స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ ‘ఎంఎస్ఎంఈల సాధికారత-సుస్థిర భవిష్యత్తు’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కృష్ణభాస్కర్ మాట్లాడుతూ.. ఉద్యమ్, జీఈఎం వంటి పోర్టల్స్ ఎంఎస్ఎంఈల మార్కెటింగ్ విస్తరణకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
ఎంఎస్ఎంఈలకు పెద్దపీట
మెంటార్షిప్ను అందిస్తే చిన్న పరిశ్రమలకు ఎంతగానో ప్రయోజనం ఉంటుందని ఈ సందర్భంగా కృష్ణభాస్కర్ అభిప్రాయపడ్డారు. ఎంఎస్ఎంఈలకు మరింత ప్రయోజనం చేకూరాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను విరివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు సాధ్యమైనంత ఎక్కువ మద్దతు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కృష్ణభాస్కర్ వివరించారు. సీఐఐ వైస్ చైర్మన్ సీ శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్ అవతరించడంలో ఎంఎస్ఎంఈల పాత్రే ఎంతో కీలకమని చెప్పారు. సీఐఐ నేషనల్ ఎంఎస్ఎంఈ కౌన్సిల్ మాజీ చైర్మన్ డాక్టర్ రమేష్ దాట్ల, ఈఈపీసీ ఇండియా చైర్మన్ మహేష్ దేశాయ్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కృషి భేష్
ఎంఎస్ఎంఈల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సీనియర్ అసోసియేట్ డీన్ డాక్టర్ చందన్ చౌదరీ ప్రశంసించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వడం, టీఎస్ ఐపాస్ వంటి చట్టాల అమలు తదితర కార్యక్రమాల ద్వారా ఎంఎస్ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని కొనియాడారు.