Budget 2022 | రెండేండ్లుగా కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నది. దాని బారి నుంచి బయటపడకముందే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో ఎకానమీ పునరుత్తేజానికి అవరోధంగా మారుతున్నాయి. ద్రవ్యలోటు, జీడీపీ, ద్రవ్యోల్బణం తదితర సవాళ్ల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022-23) వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో సమర్పించేందుకు సమాయాత్తం అవుతున్నారు. అంతే కాదు గతంలో ఎన్నడూ చూడని బడ్జెట్ను చూస్తారని నిర్మలమ్మ హామీ ఇచ్చారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో గిరాకీ పెంపు, ఉద్యోగ కల్పనకు పెద్ద పీట వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ దృక్పథమేమిటో బడ్జెట్ రూపకల్పన బృందానికి వివరించి ప్రతిపాదనలు రూపొందించడంలో ఆర్థిక మంత్రి చాలా చాకచక్యంగా వ్యవహరించాలి. సదరు బృందం కూడా అత్యంత చాతుర్యంతో విధులు నిర్వర్తిస్తూ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే అధికారులు ఎవరెవరో ఓ లుక్కేద్దాం.. !
ప్రధాని నరేంద్రమోదీ 2.0 క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ మంగళవారం నాలుగో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పించేందుకు సమాయాత్తం అవుతున్నారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. ఢిల్లీలోని జేఎన్యూలో మాస్టర్స్ పట్టా అందుకున్న నిర్మలమ్మ సేల్స్గర్ల్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. తొలినాళ్లలో లండన్లోని ఓ స్టోర్లో పని చేశారు. బ్రిటన్లోని వ్యవసాయ ఇంజినీర్ల సంఘం సలహాదారుగా పని చేసిన నిర్మలమ్మ.. మోదీ తొలి సర్కార్లో రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు.
ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో వృథా వ్యయాలు తగ్గించి ప్రభుత్వ ఖర్చులను హేతుబద్ధీకరించాల్సిన బాధ్యత కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా టీవీ సోమనాథన్దే. ప్రభుత్వ పథకాల వ్యయాలను ఆయనే అంచనా వేస్తారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఖర్చులపై ఎలా అంచనాలు రూపొందించారో వేచి చూడాలి. కలకత్తా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో పీహెచ్డీ పూర్తిచేశారు. ప్రపంచ బ్యాంక్లో సోమనాథన్ పనిచేశారు. ఆ తర్వాత పీఎంవోలో జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు.
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఆర్థిక శాఖకు బదిలీ అయిన రెవెన్యూవిభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్కు పబ్లిక్ పాలసీ, అడ్మినిస్ట్రేషన్లో సుదీర్ఘంగా మూడు దశాబ్దాల అనుభవం ఉంది. కరోనా మహమ్మారి వేళ ఆరోగ్య రంగానికి ఉద్దీపనల ప్రకటనలో ఈయనే కీలకంగా వ్యవహరించారు. వచ్చే ఏడాది పన్ను వసూళ్లు పెంచడంతోపాటు మహమ్మారి ప్ఱభావంతో దెబ్బతిన్న వ్యాపారాలు, రంగాలకు ప్రత్యేక పథకాలను ప్రకటించాల్సిన బాధ్యత తరుణ్ బజాజ్దే.
గతంలో బెంగళూరు మెట్రో ఎండీగా పని చేసిన అజయ్ సేథ్ 2021 ఏప్రిల్లో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ జీడీపీని తిరిగి గాడిలో పెట్టడానికి, ప్రైవేట్ పెట్టుబడి వ్యయాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత అజయ్ సేథ్ తలకెత్తుకున్నారు. అంతే కాదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తయారు చేసేది కూడా ఈయనే అని తెలుస్తున్నది. ఉపాధి కల్పించి రెవెన్యూ పెంచడానికి, పెద్ద ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
బ్యాంకింగ్ రంగం పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించిన దేబాశీష్ పాండా 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఒకవైపు బ్యాంకులను పటిష్ఠంగా కాపాడుతూనే మరోవైపు కరోనా వేళ ఒత్తిడికి గురైన పలు రంగాలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ద్వారా నిధులు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయినా ఎయిరిండియా విక్రయంలో దీపం కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే కీలకంగా వ్యవహరించారు. గురువారం ఎయిరిండియాను అధికారికంగా టాటా సన్స్కు కేంద్రం అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఎల్ఐసీ ఐపీవో దాదాపు ఖాయమైందని సమాచారం. వచ్చే బడ్జెట్లో మరికొన్ని ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడం కోసం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో పాండే కీలకం కానున్నారు.