Kia India | దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా.. భారత్లో విక్రయిస్తున్న రెండు మోడల్ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సెల్టోస్ ఎస్యూవీతోపాటు కరెన్స్ మోడల్ కార్ల ధరలు రెండు శాతం పెంచుతున్నామని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అయితే, ఎంట్రీ లెవల్ మోడల్ కారు సొనెట్ ధర పెంచడం లేదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కియా ఇండియా కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి.
సెల్టోస్, కరెన్స్ మోడల్ కార్లపై అక్టోబర్ రెండో తేదీ నుంచి సుమారు రెండు శాతం ధర పెంచుతున్నామని కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ నేషనల్ హెడ్ హర్దీప్ ఎస్ బ్రార్ తెలిపారు. ఇంతకుముందు రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనకు అనుగుణంగా (రెండో దశ బీఎస్-6) కార్లను అప్ గ్రేడ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఏప్రిల్ నుంచి కార్ల ధరలు పెంచేసింది కియా ఇండియా.
కియా ఇండియాతోపాటు దేశంలోని పలు కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ తర్వాత ధరలు పెంచేశాయి. ముడి సరుకు ధరలు పెరిగిపోవడంతోపాటు న్యూ సెల్టోస్ మోడల్ కారును ఆవిష్కరించడంతో భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందని హర్దీప్ ఎస్ బ్రార్ తెలిపారు. దీంతో కార్ల ధరలు పెంచక తప్పలేదన్నారు. భారత్ మార్కెట్లో కియా ఇండియా ‘ఈవీ6’ అనే ఎలక్ట్రిక్ కారు కూడా విక్రయిస్తున్నది.