న్యూఢిల్లీ : కరోనా కల్లోలం తర్వాత ఆటోమొబైల్ మార్కెట్లో తిరిగి ఉత్తేజం నెలకొంటోంది. అక్టోబర్లో కియా ఇండియా 16,331 కార్లను విక్రయించింది. కియా ఇండియా అమ్మకాల్లో ఈనెలలో కియా సెల్టోస్ అత్యధికంగా 10,488 కార్లు విక్రయించింది. ఇక కియా సొనెట్ కార్లు 5,443, కార్నివాల్ సేల్స్ 400 యూనిట్లుగా నమోదయ్యాయి. చిప్ కొరత వెంటాడుతున్నా సెల్టోస్ విక్రయాలతో కియా ఇండియా నిలకడైన సామర్ధ్యం కనబరుస్తోందని కియా ఇండియా ఎండీ, సీఈఓ టీజిన్ పార్క్ పేర్కొన్నారు.
సరఫరా అంశాల్లో ఇబ్బందులు మరికొద్ది నెలలు కొనసాగినా సత్వర డెలివరీల కోసం ప్రయత్నిస్తున్నామని, కస్టమర్లు తమ సహకారం కొనసాగించాలని కోరుతున్నామని అన్నారు. ఇక 2021లో కియా ఇండియా పలు మైలురాళ్లను అధిగమించిందని, సెల్టోస్ సేల్స్ రెండు లక్షలకు చేరడం, సొనెట్ కార్ల అమ్మకాలు లక్షకు చేరడం సంతోషాన్నిస్తోందని చెప్పారు.