న్యూఢిల్లీ, మే 26: మల్టీపర్పస్ వెహికల్ (ఎంపీవీ) కార్నివాల్ను కొన్నవారు, సంతృప్తిచెందకపోతే వాపస్చేసే స్కీమును ఆటోమొబైల్ కంపెనీ కియా ఇండియా ప్రకటించింది. తాజాగా ప్రవేశపెట్టిన ‘శాటిస్ఫాక్షన్ గ్యారంటీ స్కీము’ను కార్నివాల్ను కొత్తగా కొన్న ఖాతాదారులు ఉపయోగించుకోవొచ్చు. నచ్చనివారు కొన్నతర్వాత 30 రోజుల్లోగా ఈ వాహనాన్ని కంపెనీకి తిరిగి ఇచ్చివేయవచ్చు. కార్నివాల్ అన్ని వేరియంట్లకు ఇది వర్తిస్తుందని కియా బుధవారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వాహనాన్ని వాపస్చేసిన ఖాతాదారులకు ఎక్స్షోరూమ్ ధర, రిజిస్ట్రేషన్, ఫైనాన్స్లు వంటి ఇతరఖర్చుల మొత్తంలో 95 శాతం కంపెనీ తిరిగి చెల్లిస్తుంది. అయితే కొన్నతేదీ నుంచి వాహనం 1500 కిలోమీటర్లకు మించి తిరిగివుండకూడదని, ఎటువంటి డ్యామేజీలు, పెండింగ్ క్లయిములు వుండరాదని కంపెనీ తెలిపింది. 2020 ఆటోఎక్స్పోలో ప్రదర్శించిన తర్వాత ఏడాదికాలంలో 6,200 కార్నివాల్ వాహనాలు విక్రయమయ్యాయని, తాము కొత్తగా ప్రవేశపెట్టిన స్కీము ఖాతాదారుల నమ్మకాన్ని మరింత పెంచుతుందన్న ఆశాభావాన్ని కియా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాయ్ జిన్పార్క్ వ్యక్తంచేశారు.