ముంబై, ఏప్రిల్ 12: భారతీయ ఆటో పరిశ్రమ మార్గదర్శి, మహీంద్రా గ్రూప్ గౌరవ చైర్మన్ కేశుబ్ మహీంద్రా కన్నుమూశారు. బుధవారం ఉదయం ముంబైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు సంస్థ ప్రకటించింది. ఈయన వయసు 99 ఏండ్లు. 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. మహీంద్రా గ్రూప్ ప్రస్తుత చైర్మన్ ఆనంద్ మహీంద్రా తండ్రి, కేశుబ్ మహీంద్రా అన్నదమ్ములు. దాదాపు 50 ఏండ్లు మహీంద్రా గ్రూప్కు కేశుబ్ నాయకత్వం వహించారు. 2012 ఆగస్టులో ఆయన తప్పుకోగా.. ఈ స్థానంలోకి ఆనంద్ మహీంద్రా వచ్చారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన కేశుబ్ మహీంద్రా.. 1947లో మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరారు. 1963లో చైర్మన్గా ఎన్నికయ్యారు.
‘ఆయనో గొప్ప వ్యక్తి. పాలనాదక్షులు. ఐటీ, ఆటో, రియల్టీ, హాస్పిటాలిటీ, ఆర్థిక సేవలు ఇలా అనేక రంగాల్లోకి మహీంద్రా గ్రూప్ వ్యాపారాలను విస్తరించారు. తద్వారా మా వ్యవస్థాపకుల వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించారు. ఆయనపట్ల ఎప్పటికీ మాకున్న ప్రేమాభిమానాలు తరగవు’ అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘భారతీయ ఆటో పరిశ్రమకున్న గొప్ప మార్గదర్శకుల్లో ఒకరిని కోల్పోయాం’ అని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ విచారం వ్యక్తం చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఎండీ పవన్ గోయెంకా కూడా ట్విట్టర్లో తన సంతాపాన్ని వెలిబుచ్చారు. కాగా, సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, ఐఎఫ్సీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ తదితర ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల బోర్డులు, కౌన్సిళ్లకు కేశుబ్ మహీంద్రా నాయకత్వం వహించారు. హడ్కో వ్యవస్థాపక చైర్మన్గా కూడా గుర్తింపు పొందారు.