కరీంనగర్ విద్యానగర్, ఏప్రిల్ 2 : కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(కేడీసీసీ) రికార్డు స్థాయి లాభాలను గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంక్ రూ.100.10 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కేడీసీసీ బ్యాంకు చైర్మన్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే బ్యాంక్ డిపాజిట్లు రూ.2,282.62 కోట్ల నుంచి రూ.2,528.90 కోట్లకు పెరిగాయన్నారు. అలాగే అడ్వాన్స్లు రూ.3,242.38 కోట్ల నుంచి రూ.3,973.34 కోట్లకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
బ్యాంక్ మొత్తం వ్యాపారం 15.57 శాతం వృద్ధితో రూ.6,501.24 కోట్లుగా నమోదైందన్నారు. బ్యాంక్ సీఈవో సత్యనారాయణరావు అధ్వర్యంలో బ్యాంక్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ఈ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించడంతో బ్యాంకు సిబ్బందిని ఆయన అభినందించారు. ఎస్బీఐ, యూబీఐ తర్వాత జిల్లాలో మూడో అతిపెద్ద బ్యాంకుగా ఎదుగుతున్నదని, నాబార్డు అందించిన మద్దతుతోపాటు బ్యాంకు పాలకవర్గ సభ్యుల మద్దతుతోనే ఇది సాధ్యమైందన్నారు.