హైదరాబాద్, ఆగస్టు 8: రాష్ట్రానికి చెందిన ప్రముఖ విత్తనాల తయారీ సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.240.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.201.75 కోట్లతో పోలిస్తే 19.29 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.682.41 కోట్ల నుంచి రూ.731.95 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ జీవీ భాస్కర్ రావు మాట్లాడుతూ..గత త్రైమాసికంలో పత్తి విత్తనాలకు ఎనలేని డిమాండ్ పెరగడంతో అటు ఆదాయ, లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు.
వీటితోపాటు కూరగాయలు విత్తనాల అమ్మకాలు పెరిగాయన్నారు. కొత్తగా మార్కెట్లోకి పత్తి, వరి, కూరగాయల విత్తనాలు కూడా విడుదల చేయడం సంస్థకు కలిసొచ్చిందన్నారు.