హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో శరవేగంగా ముందుకు సాగుతున్న తెలంగాణ.. తన ప్రయాణంలో మరో మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్కు చెందిన కల్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (కేఆర్ఏఎస్) సంస్థ తన 100వ మధ్య శ్రేణి క్షిపణి (ఎంఆర్ఎస్ఏఎం) కిట్ను రూపొందించింది. గత వారం విడుదల చేసిన ఈ కిట్ను త్వరలో భారత సైన్యానికి అందించనున్నారు. ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో కేఆర్ఏఎస్, డీఆర్డీవో సంయుక్తంగా ఈ కిట్ను అభివృద్ధి చేశాయి.
వచ్చే 3-4 ఏండ్లలో కల్యాణి సంస్థ వెయ్యికిపైగా ఎంఆర్ఎస్ఏం కిట్లను సైన్యానికి సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశంలోని పలు సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల సహకారంతో కల్యాణి సంస్థ ఈ కిట్ను పొందుపరిచింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి శత్రు సేనల క్షిపణుల కదలికలను అత్యంత వేగంగా కనిపెట్టి నిలువరిస్తుంది. ఈ క్షిపణిని త్రివిధ దళాలు ఉపయోగించవచ్చు. ఇది దేశపు మొదటి త్రివిధ దళాల క్షిపణి కాగా.. యుద్ధ నౌకలు, వైమానిక స్థావరాలు, ఆర్మీ యుద్ధ క్షేత్రాలలో ఎక్కడి నుంచైనా దీనిని ప్రయోగించవచ్చు.
డిఫెన్స్ ఉత్పత్తుల స్థావరం తెలంగాణ
రక్షణ ఉత్పత్తుల్లో ప్రముఖ స్థానంలో నిలిచిన తెలంగాణ మిసైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది. అనేక రక్షణ పరికరాలు తయారు కావడమే కాకుండా పరిశోధనల కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది. డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), బీఈఎల్, హెచ్ఏఎల్ తదితర రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థలు ఇక్కడే కొలువుదీరాయి. అంతేకాకుండా ఏరోస్పేస్, డిఫెన్స్ ఉత్పత్తులకు సహకారం అందించేందుకు వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు కొనసాగుతున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎం)కు తెలంగాణ గమ్యస్థానంగా ఎదిగింది.
తెలంగాణకు చెందిన కల్యాణి రాఫెల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంస్థ క్షిపణి కిట్లను భారత సైన్యానికి అందిస్తుండటం గర్వంగా ఉన్నది. ఇది దేశంలో మొదటి ప్రైవేట్ క్షిపణి ఉత్పత్తి కేంద్రం కావడం విశేషం. రక్షణ రంగంలో హైదరాబాద్ తన బలమైన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకొనేందుకు ఇది దోహద పడుతుంది. భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా కల్యాణికి ధన్యవాదాలు.
– కే తారక రామారావు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి