ముంబై, ఏప్రిల్ 4: కరోనా సంక్షోభంతో కళతప్పిన జాబ్ మార్కెట్.. ఇప్పుడు కోలుకుంటున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నదన్న సంకేతాలనిస్తూ గత నెల నియామకాలు ఊపందుకున్నాయి. మార్చిలో గతంతో పోల్చితే 18.4 శాతం వృద్ధిరేటు నమోదైంది. ట్రావెల్, ఆతిథ్య, ఎనర్జీ రంగాల్లో అవకాశాలు ఆకర్షణీయంగా నమోదైనట్టు ఆల్సెక్ టెక్నాలజీస్ తాజా నివేదికలో తేలింది. ముఖ్యంగా ట్రావెల్, ఆతిథ్య రంగాల్లో వేతనాలపరంగా చూస్తే ఉద్యోగుల పెరుగుదల రేటు 47.6 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఎనర్జీ రంగంలోనూ 41.5 శాతం వార్షిక పెరుగుదల కనిపించింది. నిజానికి కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రంగాలు ఇవేనన్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావం, లాక్డౌన్లతో ప్రయాణాలు, పర్యాటకులు లేక దేశవ్యాప్తంగా హోటళ్లు మూతబడిన సంగతీ విదితమే.
ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో..
కరోనా సంక్షోభంలోనూ మెరుగ్గా పనిచేసిన ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో నియామకాల ప్రగతి మార్చిలో 27 శాతంగా ఉన్నట్టు ఆల్సెక్ టెక్నాలజీస్ తెలిపింది. వర్క్ ఫ్రం హోం ద్వారా ఐటీ సేవలు నిరంతరాయంగా కొనసాగినది తెలిసిందే. అయితే వలసలు ఈ పరిశ్రమను ఇబ్బంది పెట్టినా.. కొత్తవారిని తీసుకోవడంతో నియామకాలపరంగా వృద్ధే కనిపించింది. ఇక లాజిస్టిక్స్ రంగంలో 27.3 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక, ఆహార, బేవరేజెస్ రంగాల్లోనూ 16.6 శాతం, 12.9 శాతం మేరకు నియామకాలు జరిగినట్టు వెల్లడించింది.
హెల్త్కేర్, ఈ-కామర్స్ల్లో..
ఆరోగ్య సంరక్షణ, ఈ-కామర్స్ రంగాల్లో నిరుడుతో చూస్తే ఈ ఏడాది మార్చిలో రికవరీ రేటు స్వల్పంగానే ఉందని ఆల్సెక్ టెక్నాలజీస్ తెలియజేసింది. హెల్త్కేర్లో -8.3 శాతం, ఈ-కామర్స్లో -1.5 శాతం మేర కోలుకున్నాయి. వివిధ రంగాల్లో నియామకాల తీరు ఎలా? ఉందన్న దానిపై ఆల్సెక్ టెక్నాలజీస్ పనిచేస్తుంది. ఇదో సమగ్ర వ్యాపార ప్రక్రియ సేవల సంస్థ. ‘మార్చిలో అన్ని రంగాలు ఆశాజనకంగా ఉన్నాయి. రాబోయే నెలల్లో మరింత ప్రగతి కనిపిస్తుందన్న విశ్వాసం మాకున్నది’ అని ఆల్సెక్ టెక్నాలజీస్ సీఈవో ఆశిష్ జోహ్రీ అన్నారు.