Jio Phone Next | కస్టమర్లంతా ఆశగా.. ఆత్రుతగా ఎదురు చూస్తున్న చౌక స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ ఆవిష్కరణ ఆలస్యం కానున్నది. గణేశ్ చతుర్థి నాడే (సెప్టెంబర్ 10)న ప్రకటిస్తామని రిలయన్స్ వార్షిక సమావేశం వేదికగా సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. సెర్చింజన్ గూగుల్తో కలిసి అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ను డెవలప్చేశామని ఆయన ప్రకటించారు. కానీ ఆ ఫోన్ను దీపావళి కల్లా విపణిలోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. మరిన్ని ఫీచర్లను జత కలిపేందుకు జాప్యం అవుతుందని జియో చెబుతున్నా.. సెమీ కండక్టర్ల కొరతే దీనికి కారణమని తెలుస్తోంది.
‘కస్టమర్ల ఆకాంక్షలను తీర్చేలా ఈ ఫోన్ను మరింత మెరుగు పరిచేందుకు.. ఫీచర్లు చేర్చేందుకు టైం పడుతున్నదని రిలయన్స్ వర్గాల కథనం. పరిమితంగా కొందరు యూజర్లతో జియో నెక్ట్స్ ఫోన్ టెస్టింగ్ జియో-గూగుల్ మొదలు పెట్టాయి. వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఫోన్లో మరికొన్ని ఫీచర్లు తీసుకొస్తాం. దీపావళి కల్లా ఈ ఫోన్ను మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంచడానికి యత్నిస్తున్నాం. అప్పటికైనా ఇప్పుడు వెంటాడుతున్న సెమీకండక్టర్ల కొరత కూడా తీరుతుందని భావిస్తున్నాం’ అని రెండు కంపెనీలు ఉమ్మడి ప్రకటన చేశాయి.
చౌకధరలో 4జీ కనెక్టివిటీ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారి కోసం జియోఫోన్ నెక్ట్స్ రూపొందిస్తున్నట్లు గతంలోనే జియో వెల్లడించింది. రిలయన్స్ జియో కోసం ప్రత్యేకంగా గూగుల్ డెవలప్ చేసిన ఆప్టిమైజ్డ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది పనిచేస్తుంది.
ఇవీ జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్లు
పూర్తిస్థాయి స్మార్ట్ఫోన్ అయిన జియో ఫోన్ నెక్ట్స్లో వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, రియాల్టీ ఫిల్టర్స్, స్మార్ట్ కెమెరా తదితర ఫీచర్లు జత కలుస్తాయి. ఇంకా ఈ ఫోన్ ధరను నిర్ణయించలేదు. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ ధర ఉంటుందని ముకేశ్ అంబానీ ఇంతకుముందే చెప్పారు.