Jio Cloud Laptop | ప్రముఖ టెలికం కంపెనీ ‘రిలయన్స్ జియో (Reliance Jio)’ త్వరలో చౌక ధరలో లాప్టాప్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. ఈ విషయమై టెక్ దిగ్గజాలు హెచ్పీ, ఎసెర్, లెనెవో సంస్థలతో రిలయన్స్ జియో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. అత్యంత చౌక ధర రూ.15 వేలకే ఆవిష్కరించనున్న లాప్టాప్ ‘క్లౌడ్ లాప్టాప్’ అనే పేరుతో వస్తుందని సమాచారం. అన్ని సర్వీసులు పొందేందుకు వీలు కలిగేలా, లాప్టాప్ల ఖర్చు తగ్గించేలా జియో క్లౌడ్ లాప్టాప్ ఉంటుందని వినికిడి. ఇప్పటికే క్లౌడ్ లాప్ టాప్స్ కోసం క్రోమ్బుక్ను హెచ్పీ పరీక్షిస్తున్నది. అయితే ఈ విషయమై అధికారికంగా వెల్లడించడానికి ఆ కంపెనీ ముందుకు రాలేదు. ప్రస్తుతం మార్కెట్లో లాప్ టాప్ ధర కనీసం రూ.50 వేలు పలుకుతున్న సంగతి తెలిసిందే.
మెమొరీ, ప్రాసెసింగ్ పవర్, చిప్ సెట్ తదితర హార్డ్ వేర్ టూల్స్ ను బట్టి జియో ‘క్లౌడ్ లాప్టాప్’ ధర ఆధారపడి ఉంటుందని జియో అధికార వర్గాలు చెబుతున్నాయి. జియో క్లౌడ్ బ్యాక్ ఎండ్ కేంద్రంగా ‘జియో క్లౌడ్ లాప్టాప్ రూపుదిద్దుకోనున్నది. ఫలితంగా అత్యధిక శక్తి, సామర్థ్యాలతో కూడిన హార్డ్ వేర్ వల్ల సాధారణంగా ధర పెరుగుతుంది. కానీ ఈ లాప్ టాప్ ధర తగ్గుతుందని చెబుతున్నారు.
రిలయన్స్ జియో పర్సనల్ కంప్యూటర్ యూజర్ల కోసం ‘క్లౌడ్ పీసీ’ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తెస్తున్నది. దీని టారిఫ్ ఎంత ఉంటుందన్నది వెల్లడించలేదు. కొత్త కంప్యూటర్లు కొనలేని వారు అన్ని రకాల కంప్యూటర్ సర్వీసులు పొందేలా క్లౌడ్ మంత్లీ సబ్ స్క్రిప్షన్ ఉంటుందని తెలుస్తోంది. గత జూలై 31న రిలయన్స్ జియో తొలి లెర్నింగ్ బుక్.. జియో బుక్ లాప్ టాప్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.