న్యూఢిల్లీ, ఆగస్టు 21: జోరు మీదున్న దేశీయ ఫిన్టెక్ రంగంలో భారీ అంచనాలతో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జియో ఫిన్) స్టాక్ మార్కెట్లో లిస్టయిన తొలిరోజే ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. గత నెలలో విలువ నిర్దారణ కోసం ఎక్సేంజీలు నిర్వహించిన ట్రేడింగ్లో రూ.262 సమీపంలో ధర పలికిన జియో ఫిన్ సోమవారం అధికారికంగా లిస్టయ్యింది. ఇది రూ. 300కు పైగా లిస్ట్ కావచ్చన్న అంచనాలు కొద్దిరోజులుగా మార్కెట్లో నెలకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా తొలుత కొద్ది నిమిషాలపాటు రూ.260-265 మధ్య రెండు ఎక్సేంజీల్లోనూ చేతులు మారిన ఈ షేరు తదుపరి రోజంతా 5 శాతం లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యింది.బీఎస్ఈలో లోయర్ సర్క్యూట్ పరిమితి రూ.251.75, ఎన్ఎస్ఈలో రూ.248.90 వద్ద ముగిసింది. జియో ఫిన్ను10 రోజుల పాటు ఎక్సేంజీలు ట్రేడ్-టు-ట్రేడ్ విభాగంలో ఉంచడంతో పాటు 5 శాతం సర్క్యూట్లను అమలు చేస్తున్నాయి. ట్రేడింగ్ తొలిరోజున బీఎస్ఈలో 35.5 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 7.47 కోట్ల జియో ఫిన్ షేర్లు చేతులు మారాయి.
బీఎస్ఈలో ముగింపు ధర ప్రకారం జియో ఫైనాన్షియల్ మార్కెట్ విలువ రూ.1,59,543.93 కోట్లు ఉంది. మార్కెట్ విలువలో టాప్ కంపెనీల్లో ఇది 34వ స్థానంలో నిలిచింది. గత నెలలో ముకేశ్ అంబానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నుంచి జియో ఫిన్ను వేరుపర్చిన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్ షేర్హోల్డర్లకు ప్రతీ ఒక్క షేరుకు ఒక జియో ఫిన్ షేరును కేటాయించారు. ఈ నేపథ్యంలో ఒడిదుడుకుల్ని పరిమితం చేసేందుకు తొలిరోజునే దీనిని బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీల్లో చేర్చారు. సెన్సెక్స్లో ఇది 31వ షేరుగానూ, నిఫ్టీలో 51వ షేరుగానూ ఉంటుంది. లిస్టింగ్ నాటి నుంచి మూడవ రోజు ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఇండెక్స్ల నుంచి జియో ఫిన్ను ఎక్సేంజ్లు తొలగిస్తాయి. సోమవారం స్టాక్ సూచీలు పెరిగినప్పటికీ, జియో ఫిన్తో పాటు దీని మాతృసంస్థ ఆర్ఐఎల్ షేరు సైతం 1.5 శాతం క్షీణించి రూ.2,518 వద్ద ముగిసింది.