Jio Financial Services | రిలయన్స్ (Reliance) అనుబంధ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (Jio Financial Services) నిధుల సేకరణపై ఫోకస్ చేస్తోంది. అందుకోసం తొలిసారి బాండ్లు జారీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై మర్చంట్ బ్యాంకర్లతో జియో ఫైనాన్సియల్ (Jio Financial Services) ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. రూ.5000 కోట్ల (600.6 మిలియన్ డాలర్లు) నుంచి రూ.10 వేల కోట్లు (1201.2 మిలియన్ డాలర్లు) సేకరించాలని జియో ఫైనాన్సియల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మార్కెట్లోకి బాండ్లు జారీ చేయనున్నదని బ్యాంకర్లు తెలిపారు.
గత ఆగస్టులోనే రిలయన్స్ నుంచి విడివడి.. సొంతంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన జియో ఫైనాన్సియల్ (Jio Financial Services) ప్రస్తుతం తన క్రెడిట్ రేటింగ్, ఇతర రెగ్యులేటరీ అనుమతులు తీసుకునే పనిలో పడింది. బాండ్ల జారీ విషయమై తమను జియో ఫైనాన్సియల్ సంప్రదించిన సంగతి చెప్పడానికి మర్చంట్ బ్యాంకర్లు నిరాకరించాయి. దీనిపై స్పందించడానికి రిలయన్స్ అందుబాటులోకి రాలేదు. ఆటో, ఇంటి రుణాలు, ఇతర రుణాల మార్కెట్ పెరుగుతున్న తరుణంలో పూర్తిస్థాయిలో ఫైనాన్సియల్ సర్వీసులు అందించడానికి రిలయన్స్ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఆగస్టులో రిలయన్స్ నుంచి విడివడి.. స్టాక్ మార్కెట్లలో లిస్టయింది.