Jio 5G | దేశంలో 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో ఆధ్వర్యంలో 5జీ సేవలు మొదలయ్యే ముహూర్తం ఈ నెల 29న వెల్లడి కానున్నది. ఈ నెల రిలయన్స్ వాటాదారుల 45వ వార్షిక సమావేశం (ఏజీఎం)లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. అలాగే చౌక స్మార్ట్ ఫోన్ జియోఫోన్ 5జీ కూడా ఈ సమావేశంలోనే మార్కెట్లోకి ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. రిటైల్, ఈ-కామర్స్, ఆయిల్ టు కెమికల్ తదితర రంగాల్లో చేపట్టే ప్రణాళికలపై రిలయన్స్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
5జీ సేవల ప్రారంభానికి అవసరమైన 5జీ స్పెక్ట్రం వేలంలో అత్యధిక వాయు తరంగాలను సుమారు రూ.87,000 కోట్ల (11 బిలియన్ల డాలర్లు)తో కొనుగోలు బిడ్లు దాఖలు చేసింది రిలయన్స్. తొలి దశలో ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్ సహా దేశంలోని 13 ప్రధాన నగరాల పరిధిలో హైస్పీడ్ 5జీ సేవలు ప్రారంభం అవుతాయని టెలికం శాఖ ఇప్పటికే ప్రకటించింది.
దేశంలో తమ 5జీ సేవల తేదీని కూడా ఈ నెల 29న రిలయన్స్ ప్రకటించనున్నది. ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం రిలయన్స్ జియో 5జీ ఫోన్ ధర రూ.9000 నుంచి రూ.12 వేల మధ్య ఉండొచ్చునని సమాచారం.