న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశంలోని నాలుగు నగరాల్లో టెలికం దిగ్గజం జియో అక్టోబర్ 5 నుంచి 5జీ బీటా ట్రయిల్ సేవల్ని ప్రారంభించనుంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిల్లో మొదలయ్యే ఈ సేవలు ఎంపికచేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయని కంపెనీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తమ 5జీ సర్వీసుల్ని ఉపయోగించుకునేందుకు ‘జియో ట్రూ 5జీ వెల్కం ఆఫర్’ పేరుతో కొంతమంది కస్టమర్లను కంపెనీ ఆహ్వానిస్తుంది. వీరికి సెకండ్కు 1 గిగాబిట్ స్పీడ్తో అన్లిమిటెడ్ 5జీ డాటా లభిస్తుంది. తమ ట్రూ-5జీ సర్వీసుల్ని ఇటీవల జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రదర్శించిన మీదట దసరా సందర్భంగా బీటా ట్రయిల్ను ప్రారంభిస్తున్నట్టు జియో వివరించింది. వెల్కం ఆఫర్తో ఆహ్వానించిన యూజర్లు వారి ప్రస్తుత సిమ్కార్డ్ గానీ, 5జీ హ్యాండ్సెట్ను మార్చుకోనవసరం లేదని, ఆటోమేటిక్గా 5జీ సర్వీసులకు అప్గ్రేడ్ అవుతుందని జియో తెలిపింది. అలాగే యూజర్లు వారి ప్రస్తుత 4జీ ప్లాన్ ప్రకారమే టారీఫ్ చెల్లిస్తే చాలని, ట్రయిల్ సందర్భంగా 5జీ డాటాకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది.