ముంబై, జనవరి 18: బంగారు ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ నెలలో రూ.18, 281.49 కోట్లు(2,195.23 మిలియన్ డాలర్లు) విలువైన జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతి అయ్యాయని జెమ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. అంతక్రితం ఏడా ది ఇదే నెలలో ఎగుమతైన రూ.19, 901.55 కోట్లు(2,413.46 మిలియన్ డాలర్లు) తో పోలిస్తే 8 శాతం తగ్గినట్టు పేర్కొంది.
అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ముఖ్యం గా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో అభరణాలకు డిమాండ్ పడిపోయిందని, 60 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతుండటం కూడా ఇందుకు కారణమని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు. అలాగే కట్, డైమండ్స్ల ఎగుమతులు కూడా ఏడాది ప్రాతిపదికన 31.42 శాతం తగ్గి రూ.7,182.53 కోట్లకు పడిపోయాయి. కానీ, పసిడి ఆభరణాల ఎగుమతులు 47.32 శాతం ఎగబాకి రూ.7,508.05 కోట్లకు చేరుకున్నాయి.