ముంబై, సెప్టెంబర్ 14: ఓ మనీ లాండరింగ్ కేసులో జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ను రూ.538 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలున్న కేసుకు సంబంధించి ముంబైలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు గోయల్కు ఈ రిమాండ్ను ఇచ్చింది. చాలాకాలంపాటు ఇక్కడున్న తమ కార్యాలయంలోనే గోయల్ను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఈ నెల 1న పీఎంఎల్ఏ కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే గురువారంతో ఈడీ రిమాండ్ ముగుస్తున్న క్రమంలో ప్రత్యేక కోర్టులో గోయల్ను దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీని విధించారు. కాగా, నవీ ముంబైలోని తలోజా జైలుకు బదులు దక్షిణ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తనను పంపించాలన్న గోయల్ అభ్యర్థనను ఈ సందర్భంగా కోర్టు అంగీకరించింది. ఇదిలావుంటే తనకు గుండె సంబంధిత, రక్తపోటు, మధుమేహం, భుజం-మెడ నొప్పి తదితర ఆరోగ్య సమస్యలున్నాయని, రోజువారీ వైద్య పరీక్షల నిమిత్తం తమ కుటుంబ, వ్యక్తిగత వైద్య నిపుణులను జైలులోకి అనుమతించాలని కోర్టుకు గోయల్ విజ్ఞప్తి చేశారు. అలాగే పడక సదుపాయం, ఇంటి భోజనాన్ని కూడా అనుమతించాలని కోరారు.
దీంతో ప్రాసిక్యూషన్ను దీనిపై స్పందించాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసును ఈడీ దాఖలు చేసింది. గోయల్తోపాటు ఆయన భార్య అనిత, ఇతర కంపెనీ ఉన్నతోద్యోగులపైనా కేసులు పెట్టింది. జెట్ ఎయిర్వేస్కు కెనరా బ్యాంక్ రూ.848.86 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో రూ.538.62 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. అయితే జెట్ ఎయిర్వేస్ మోసం చేసి రుణాలు తీసుకున్నట్టు బ్యాంక్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులు వచ్చిపడ్డాయి.