Jet Airways – Naresh Goyal | హవాలా లావాదేవీల కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు ఆరోగ్య కారణాలతో బాంబే హైకోర్టు సోమవారం రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. హవాలా లావాదేవీల కేసులో గతేడాది సెప్టెంబర్లో నరేశ్ గోయల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తనతోపాటు తన భార్య అనితా గోయల్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నామని, తన భార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఈ దశలో ఆమె వద్ద తాను ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ బాంబే హైకోర్టులో నరేశ్ గోయల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ను జస్టిస్ ఎన్జే జమాదర్ సారధ్యంలోని సింగిల్ బెంచ్ విచారించి రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలల కాలంలో ప్రైవేట్ దవాఖానలో చికిత్స తీసుకునేందుకు నరేశ్ గోయల్కు అనుమతి ఇచ్చింది. తాత్కాలిక బెయిల్ కోసం రూ.లక్ష పూచీకత్తు కింద చెల్లించాలని, బెయిల్ కాలంలో దిగువ న్యాయస్థానం అనుమతి ఇస్తే తప్ప బయటకు వెళ్లొద్దని ఆదేశించింది. నరేశ్ గోయల్ తన పాస్పోర్టును సరెండర్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
మెడికల్, మానవత్వ కోణంలో బెయిల్ మంజూరు చేయాలన్న నరేశ్ గోయల్ అభ్యర్థను న్యాయస్థానం మన్నించింది. జెట్ ఎయిర్వేస్కు కెనరాబ్యాంకు ఇచ్చిన రూ.538.62 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు హవాలా లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గతేడాది సెప్టెంబర్లో నరేశ్ గోయల్ను అరెస్ట్ చేసింది. ఇదే కేసులో గతేడాది నవంబర్లో ఆయన భార్య అనితా గోయల్ను అదుపులోకి తీసుకున్నా, తర్వాత బెయిల్ మంజూరైంది.
గత ఫిబ్రవరిలో గోయల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. నరేశ్ గోయల్ తరఫున వాదించిన హరీశ్ సాల్వే మాట్లాడుతూ మానవత్వ కోణంలో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో వారిద్దరి మధ్య భావోద్వేగ సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. అనితా గోయల్ చికిత్స వేళ ఆయన మద్దతు అవసరం అని హరీశ్ సాల్వే వాదించారు. ఇటీవలి వైద్య నివేదిక లేదంటూ నరేశ్ గోయల్కు బెయిల్ మంజూరు చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. తాజాగా వైద్య నిపుణుల అంచనా తర్వాతే నాలుగు వారాల పాటు దవాఖానలో వైద్య చికిత్సకు అనుమతి ఇవ్వాలని కోరింది.