Jeep Grand Cherokee | ప్రముఖ కార్ల తయారీ సంస్థ `జీప్ ఇండియా` దేశీయ మార్కెట్లోకి గురువారం ఐదో జనరేషన్ గ్రాండ్ చెరోకీని ఆవిష్కరించింది. ప్రీమియం ఎస్యూవీ కారులో ఇది లేటెస్ట్ జనరేషన్. ఎస్యూవీ గ్రాండ్ చెరోకి ధర రూ.77.50 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు నాలుగు రంగుల ఆప్షన్లు.. బ్రైట్ వైట్, డైమండ్ బ్లాక్ క్రిస్టల్, మౌంటైన్ అండ్ వెల్వెట్ రెడ్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెలాఖరులో ఎస్యూవీ కార్ల డెలివరీ మొదలవుతుంది. రూ.50 వేలు చెల్లించి ఈ కారు బుక్ చేసుకోవచ్చు.
గత సెప్టెంబర్లోనే గ్లోబల్ మార్కెట్లోకి ఎంటరైందీ ఈ గ్రాండ్ చెరోకీ. అమెరికా తర్వాత భారత్లో మాత్రమే జీప్ ఇండియా తన గ్రాండ్ చెరోకీ కారును తయారు చేస్తున్నది. మహారాష్ట్రలోని రంజన్గావ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో జీప్ ఇండియా ఈ కార్లను ఉత్పత్తి చేస్తోంది.
వెహికల్ మానిటరింగ్, స్మార్ట్వాచ్ ఎక్స్టెన్షన్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, రిమోట్ వెహికల్ మేనేజ్మెంట్, 24-అవర్స్ సర్వైలెన్స్ వంటి 33 కనెక్టెడ్ ఫీచర్లతో గ్రాండ్ చెరోకీ వస్తున్నది. ప్రయాణికుల సేఫ్టీకి జీప్ ఇండియా ప్రాధాన్యం ఇస్తున్నది. 8-ఎయిర్బ్యాగ్స్తోపాటు 110+ సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి వస్తున్నది. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, యాక్టివ్ లేన్ మేనేజ్మెంట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి లెవెల్ 2 అడాస్ ఫీచర్లు జత కలిశాయి.
కేవలం భారత్లో మాత్రమే ఏకైక ఇంజిన్ ఆప్షన్తో మార్కెట్లోకి విడుదల అవుతుంది. 2.0 లీటర్ల జీఎంఈ టీ4 (8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్) టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో గ్రాండ్ చెరోకీ వస్తున్నది. ఈ ఇంజిన్ 272 బీహెచ్పీ పవర్, 400 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్5, అడీ క్యూ7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్, రేంజ్ రోవర్ స్పోర్ట్, వోల్వో ఎక్స్సీ90 వంటి కార్లకు భారత్లో జీప్ గ్రాండ్ చెరోకీ గట్టి పోటీ ఇవ్వనున్నదని చెబుతున్నారు.