న్యూఢిల్లీ: పండగల పూట షాపింగ్ చేయడానికి వెళ్తున్నారా? అయితే త్వరలోనే మీరు జీన్స్( Jeans Price ), టీషర్ట్స్లాంటి వాటికి గతంలో ఎప్పుడూ చేయనంత ఖర్చు చేయాల్సి రావచ్చు. కారణం ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు భారీగా పెరగడమే. గత పదేళ్లలో తొలిసారి కాటన్ ఫ్యూచర్స్ పౌండ్ (సుమారు 453 గ్రాములు)కు ఒక డాలర్కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, షిప్పింగ్ ధరలు పెరగడం వంటివి దుస్తుల తయారీపై ప్రభావం చూపించాయి. అమెరికా, ఇండియాలాంటి పత్తి ఎక్కువగా పండే దేశాల్లో వివిధ కారణాల వల్ల ఈ పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది.
దీంతో దుస్తుల తయారీ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. లివై స్ట్రాస్లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ పెరిగిన ధరల కారణంగా ప్రభావితమవుతున్నాయి. ఈ పెరిగిన ధరలను కంపెనీలు, రీటెయిలర్లు కస్టమర్లకు బదిలీ చేయాలని భావిస్తే.. జీన్స్, టీషర్ట్స్లాంటి ధరలు పెరగడం ఖాయం. న్యూయార్క్లో డిసెంబర్లో డెలివరీ కోసం పౌండు కాటన్ ధర 3.6 శాతం పెరిగి 1.0155 డాలర్లకు చేరింది. 2011, నవంబర్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మొత్తంగా ధర 28 శాతం పెరిగింది.