తెలంగాణలో స్టార్టప్లు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. తద్వారా తెలంగాణ ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతాం. నిజానికి ప్రపంచంలోనే ఓడీఏ రుణం ద్వారా స్టార్టప్లకు జికా మద్దతివ్వడం ఇదే తొలిసారి. స్టార్టప్లకు చేయూతనివ్వడంలో భారత్-జపాన్ మధ్య సహకారానికీ ఇది దోహదం చేయగలదు.
-సైటో మిట్సునోరి, జైకా ఇండియా ఆఫీస్ ప్రధాన ప్రతినిధి
హైదరాబాద్, ఫిబ్రవరి 20: దేశంలో ఆయా రంగాల్లోని పలు ప్రాజెక్టులకు రుణ సదుపాయాన్ని అందించేందుకు జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో స్టార్టప్లు, నూతన ఆవిష్కరణల ప్రోత్సాహానికి మరింత దన్ను లభించింది.
ఆ దేశ అధికారిక అభివృద్ధి సహాయ (ఓడీఏ) రుణాన్ని జైకా పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మంగళవారం ఓ కీలక భాగస్వామ్య రుణ ఒప్పందాన్ని జైకా చేసుకున్నది. దీని ప్రకారం రాష్ట్రంలో మెరుగైన స్టార్టప్ ఎకోసిస్టమ్, నూతన ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పన, ఆర్థికాభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో తెలంగాణ ప్రభుత్వ సాధికారత కోసం దాదాపు రూ.1,336 కోట్ల రుణం అందుతున్నది.
మహిళలకు చేయూత
నగరాలు, పట్టణాల్లోని ఔత్సాహికుల కోసమేగాక గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, వ్యాపార ఆశావహులకు అండగా ఓ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా రూపొందించారు. ఇందులో భాగంగానే ఈ ఓడీఏ రుణ సదుపాయం జికా నుంచి వస్తున్నది. పురుషులతో సమానంగా స్త్రీలకూ అవకాశాలు, ఆర్థిక చేయూత అందాలని కోరుకుంటున్నది. కాగా, ఈ రుణ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్, జికి ఇండియా ప్రధాన ప్రతినిధి సైటో మిట్సునోరి సంతకాలు చేశారు.
మొత్తం రూ.13వేల కోట్లు
దేశంలో రహదారుల అభివృద్ధి, వాతావరణ మార్పులపై ప్రతిస్పందన, ఉద్యోనవనాలు తదితర రంగాల్లోగల 9 ప్రాజెక్టులకు దాదాపు రూ.13,000 కోట్ల (232.21 బిలియన్ యెన్లు) ఓడీఏ రుణాన్ని ఇచ్చేందుకు జికా అంగీకరించింది. ఇందులో ఈశాన్య భారతంలోని మౌలిక రంగ ప్రాజెక్టులకూ రుణ సాయం అందనున్నది.