న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముందస్తుగానే ప్యాక్చేసి, లేబుల్తో విక్రయించే జొన్న పిండి, రాగి పిండి తదితర మిల్లెట్ పిండిపై వస్తు సేవల పన్నును (జీఎస్టీ) 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం అనంతరం శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌన్సిల్ నిర్ణయాల్ని వెల్లడిస్తూ లూజ్గా విక్రయించే మిల్లెట్ పిండిపై పన్ను మినహాయిస్తున్నట్టు తెలిపారు. పోషకాహార విలువ, ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే తృణధాన్యాల ఆహారోత్పత్తుల్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరమైన 2023లో జీఎస్టీని తగ్గిస్తున్నట్టు తెలిపారు.
మొలాసిస్: చెరుకు క్రషింగ్ ద్వారా ఉత్పత్తయే మొలాసిస్పై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ చర్యతో చక్కెర మిల్లుల వద్ద నగదు లభ్యత మెరుగుపడి, చెరకు రైతుల బకాయిల్ని వేగంగా చెల్లించగలుగుతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఆల్కహాల్: మానవ వినియోగానికి సంబంధించిన ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)ను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. లిక్కర్ తయారీలో ఇది కీలకమైన ముడి పదార్థం. తాజా నిర్ణయంతో దీనిపై ఇకమీదట 18 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) బదులు ఇంటర్-స్టేట్ సేల్స్పై 2 శాతం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్మాత్రమే వర్తిస్తుంది. ఈ పన్ను భారీగా తగ్గినంత మాత్రాన లిక్కర్ ధరల్లో మార్పు ఏదీ ఉండదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు పారిశ్రామిక వినియోగానికి ఉద్దేశించిన ఈఎన్ఏపై 18 శాతం జీఎస్టీని విధించారు.
ఇతర సర్వీసులు: ప్రభుత్వ యంత్రాంగాలకు అందించే తాగునీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, స్లమ్స్ మెరుగుదల వంటి సేవలపై జీఎస్టీని మినహాయించారు.
జరీ దారం: మెటలైజ్డ్ పాలియస్టర్ ఫిల్మ్/ప్లాస్టిక్ ఫిల్మ్ నుంచి తయారుచేసే జరీ దారం లేదా నూలుపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
బార్లీ ప్రాసెసింగ్: బార్లీని మాల్ట్గా ప్రాజెస్ చేసే జాబ్వర్క్ సర్వీసులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి కుదించారు.
కార్పొరేట్ గ్యారంటీలు: కంపెనీ డైరెక్టర్ ఇచ్చే కార్పొరేట్ గ్యారంటీపైన జీఎస్టీని మినహాయించగా, హోల్డింగ్ కంపెనీ అందించే కార్పొరేట్ గ్యారంటీకి చెందిన మొత్తం సొమ్ముపై 18 శాతం జీఎస్టీ వరిస్తుంది.