JLR Blue Print | టాటా మోటార్స్ అనుబంధ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంప్రదాయ పెట్రోల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిశగా పరివర్తన చెందనున్నది. 2025లో తొలి విద్యుత్ కారును ఆవిష్కరిస్తుందని జేఎల్ఆర్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మోడ్రన్ లగ్జరీ కార్ల బిజినెస్ దిశగా ఈ బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ అడుగులు వేసేందుకు సర్వం సిద్ధమైందని చెప్పారు. 2008 నుంచి టాటా మోటార్స్ అనుబంధ సంస్థగా జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) కొనసాగుతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత, ఉక్రెయిన్ మీద రష్యా సైనిక దాడితో ఇంధన కొరత, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో జేఎల్ఆర్ విభిన్న వ్యాపార పరిస్థితులనెదుర్కొన్నదని అన్నారు చంద్రశేఖరన్.
జేఎల్ఆర్ తాత్కాలిక సీఈఓ అడ్రైన్ మార్డెల్ మాట్లాడుతూ రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ విభాగాల్లో పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తామని తెలిపారు. ప్యూర్ ఎలక్ట్రిక్ రేంజ్ రోవర్ మోడల్ కారుతో ప్రారంభం అవుతుందని, ఈ ఏడాది చివర్లో ప్రీ-ఆర్డర్లు తీసుకుంటామన్నారు. 700 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యంగల మూడు న్యూ జాగ్వార్ కార్లు మార్కెట్లోకి తొలుత విడుదల చేస్తామన్నారు. వచ్చే ఏడాది సెలెక్టెడ్ మార్కెట్లలో సేల్స్ ప్రారంభిస్తామని, 2025లో క్లయింట్లకు కార్ల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు.