బీజింగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా అధినేత, ప్రపంచంలోనే 25వ కుబేరుడు జాక్ మా నెమ్మదిగా కుప్పకూలిపోతున్నారు. 1326 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల జాక్ మా సామ్రాజ్యంపై చైనా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది.
ఇప్పటికే జాక్ మా సంపదలో సగం హరించుకుపోయింది. ప్రత్యేకించి ఆలీబాబా అనుబంధ సంస్థ యాంట్ గ్రూప్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. తర్వాత కంపెనీ బిజినెస్నే అమ్ముకోవాల్సి వచ్చింది.
గతేడాది వరకు తాను చెప్పిందే వేదంగా ముందుకు సాగిన జాక్ మా పరిస్థితులు మారిపోయాయి. ఒక దాని తర్వాత మరొక సంస్థపై నియంత్రణ కోల్పోతున్నారు. వివిధ సంస్థల్లో తన వాటాలను ఆయన విక్రయిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో ఆలీబాబా మార్కెట్ క్యాపిటలైజేషన్ 857 బిలియన్ల డాలర్లు. కానీ ఈనాడు అది 588 బిలియన్లకు పడిపోయింది.
గతేడాది ఆయన సారధ్యంలోని యాంట్ గ్రూప్ ఐపీవోకు పిలుపునిచ్చినా చివరిక్షణంలో రద్దయింది. ఆ క్షణం నుంచి జాక్ మా కష్టాలు మొదలయ్యాయి. యాంట్ గ్రాప్ ప్రకటించిన ఐపీవోతో దాని ఎం-క్యాప్ 470 బిలియన్ల డాలర్లయితే, ఇప్పుడది 108 బిలియన్ల డాలర్లకు పరిమితం.
గతేడాది జరిగిన ఒక కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్పై విమర్శలు గుప్పించారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తున్నప్పుడు ఆంక్షలను సడలించాలని అధికారులకు ప్రతిపాదించారు. బ్యాంకింగ్ నియంత్రణలను వ్యతిరేకించారు. ఆ కార్యక్రమంలో జాక్ మా ప్రసంగం.. చైనా కమ్యూనిస్టు పార్టీకి నచ్చలేదు. దాంతో ఆయన కష్టాలు మొదలయ్యాయి.
ఏడాది క్రితం జాక్ మా.. చైనాలోకెల్లా అతిపెద్ద కుబేరుడు ఆయన. ఆయన దేశంలోకెల్లా అతిపెద్ద టెక్ కంపెనీ ఆలీబాబా, ప్రపంచంలోకెల్లా ఫిన్ టెక్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో ఉన్నది. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది.
జాక్ మా నష్టాలకు యాంట్ గ్రూప్ ఐపీవోను రద్దు చేసుకోవడమే ప్రధాన కారణం. కాకపోతే చైనా ప్రభుత్వమే దాన్ని రద్దు చేయించి ఉండొచ్చు. యాంట్ గ్రూప్ ఐపీవో ద్వారా 34.5 బిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చుకోవాలని జాక్ మా తలపోశారు. 2014లో ఆలీబాబా ఐపీవో ఆఫర్ చేసినప్పుడు 25 బిలియన్ల డాలర్ల నిధులు వచ్చాయి.
మీడియా సంస్థల్లో వాటాలను విక్రయించాలని జాక్మాను, ఆయన సారధ్యంలోని ఆలీబాబాను గత మార్చిలో చైనా సర్కార్ ఆదేశించింది. ఒక టెక్నాలజీ కంపెనీకి మీడియాలో ప్రభావంపై చైనా సర్కార్ ఆందోళన చెందినట్లు కనిపిస్తున్నది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్టు దినపత్రికను ఆలీబాబా స్వాధీనం చేసుకున్నది. 118 ఏండ్ల ఈ దినపత్రికకు చైనా కేంద్రంగా ఉన్న మీడియా కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాతో కలిసి జాయింట్ వెంచర్లు నిర్వహించింది.