ITR Verification | పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ వన్టైం రిలాక్సేషన్ సౌకర్యం కల్పించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలుకు 2021 డిసెంబర్ 31తో గడువు ముగిసిందని తెలిపింది. అయితే, దాఖలైన ఐటీఆర్ల్లో ఈ-వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వాటిని వెరిఫై చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఐటీ ఈ-ఫైలింగ్ కోసం ఆదాయం పన్ను శాఖ ఈ ఏడాది ప్రారంభించిన నూతన పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ-వెరిఫికేషన్ కోసం పన్ను చెల్లింపుదారులకు ఒక అవకాశం కల్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిర్ణయించిందని ఐటీ శాఖ తెలిపింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి ఐటీఆర్ల వెరిఫికేషన్ పెండింగ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. పన్ను చెల్లింపు దారులు ఐటీఆర్-5 ఫామ్ సమర్పించకపోయినా పెండింగ్లో ఉండొచ్చు. కనుక అటువంటి వారు ఈ-వెరిఫికేషన్ చేసుకోవడానికి వన్టైం రిలాక్సేషన్ ఇవ్వాలని సీబీడీటీ నిర్ణయించింది.
ఫిబ్రవరి 28 లోగా తప్పనిసరి ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని ఐటీ శాఖ ట్విట్టర్ వేదికగా సర్క్యులర్ జారీ చేసింది. ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన ఐటీఆర్లకు సంబంధించిన ఐటీ రీఫండ్స్ ప్రాసెసింగ్ జూన్ 30 నాటికి పూర్తవుతుందని తెలిపింది. ఒకవేళ గడువు లోపు ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయకుంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది.