Financial Tasks | ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నది. ఎటువంటి పెనాల్టీలు లేకుండా సజావుగా ఆర్థిక లావాదేవీలు జరుపాలంటే ఈ నెల 31 లోగా ప్రతి ఒక్కరూ 8 ఫైనాన్సియల్ టాస్క్లు తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. అవేమిటో ఓ లుక్కేద్దాం..
ఈ నెల 31 లోపు మీరు మీ ఆధార్ కార్డును పాన్కార్డును తప్పనిసరిగా అనుసంధానించాలి. ఒకవేళ అనుసంధానించకపోతే మీ పాన్ కార్డు ఇన్ యాక్టివ్ అవుతుంది. మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలు కాదు. ఆధార్-పాన్ కార్డు అనుసంధానించకుండా మీరు మీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేరు. ఆదాయం పన్ను చట్టంలోని 234హెచ్ సెక్షన్ కింద మీపై పెనాల్టీ విధించొచ్చు కూడా. ఆ పెనాల్టీ ఎంత అన్నది ప్రభుత్వం ప్రకటించలేదు.
బ్యాంకు ఖాతాలతో కేవైసీ అప్డేట్ పూర్తి చేయడానికి ఈ నెలాఖరు తుది గడువు. ఇంతకుముందు గతేడాది డిసెంబర్ నెలాఖరు వరకు విధించిన గడువును ఆర్బీఐ పొడిగించింది. పాన్, ఆధార్, పాస్పోర్ట్లతోపాటు బ్యాంకులతో సంబంధం ఉన్న తాజా సమాచారాన్ని ప్రతి ఖాతాదారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
మీరు పోస్టాఫీసులో గానీ, బ్యాంకులో గానీ చిన్న మొత్తాల పొదుపు ఖాతా కలిగి ఉన్నారా.. అయితే పోస్టాఫీసులో మీ పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను మీ పోస్టాఫీసు టైం డిపాజిట్ లేదా బ్యాంక్ డిపాజిట్ ఖాతాతో తప్పనిసరిగా అనుసంధానించాలి. అప్పుడే మీ డిపాజిట్పై వడ్డీ ఆదాయం మీ ఖాతాకు వస్తుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వచ్చే వడ్డీ ఆదాయం మీ పోస్టాఫీసు ఖాతాకు గానీ, బ్యాంకు ఖాతాలో గానీ జమ అవుతాయి.
పీఎం కిసాన్ యోజనకు అర్హులైన రైతులు ఆఫ్లైన్లో గానీ, ఆన్లైన్లో గానీ తమ కేవైసీ పత్రాలను అప్డేట్ చేయాలి. తదుపరి ఇన్స్టాల్మెంట్ సొమ్ము జమ కావడానికి ఈ నెలాఖరులోగా కేవైసీ పత్రాలు సమర్పించాలి. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులు ఈ-కేవైసీ అప్డేట్ చేయడం తప్పనిసరి అని పీఎం కిసాన్ వెబ్సైట్ చెబుతున్నది. సమీప సీఎస్సీ సెంటర్లలో బయోమెట్రిక్ అథంటిక్ కాంటాక్ట్ కోసం పీఎం కిసాన్ యోజన వెబ్సైట్లోకి వెళ్లి ఈ-కేవైసీలో ఆధార్ ఆధారిత ఓటీపీ అథంటికేషన్ కోసం ఈ-కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయాలి.
మీ పీపీఎఫ్ ఖాతాను సేవ్ చేయడానికి ప్రతియేటా రూ.500 ఖాతాలో డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీ ఖాతా ఇన్ యాక్టీవ్ అయితే, దాన్ని కొద్ది మొత్తం సొమ్ము ఫైన్ చెల్లించి ప్రతి యేటా రూ.500 డిపాజిట్ చేయాలి.
ఎన్ఎస్డీఎల్ లేదా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్)లలో నగదు డిపాజిట్ చేసేవారు తమ డీమాట్, ట్రేడింగ్ ఖాతాల్లో ఆరు కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
అవేమిటంటే..
పేరు, చిరునామా, పాన్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఆదాయం శ్రేణి తెలుపాలి.
ఈ నెలాఖరుతో పీఎంఏవై స్కీం ముగింపు దశకు చేరుకున్నది. సొంతింటి కొనుగోలు దారుల కోసం పట్టణ గృహ దారిద్య్ర నిర్ములన శాఖ (ఎంవోహెచ్యూపీఏ).. పీఎంఏవై హౌసింగ్ సబ్సిడీని ప్రారంభించింది. ప్రధానమంత్రి అవాజ్ యోజన (పీఎంఏవై – అర్బన్) 2015 జూన్ నుంచి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం (సీఎల్ఎస్ఎస్) అమలు చేస్తున్నది.
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెలాఖరు తుది గడువు. ఈ గడువు లోగా సబ్మిట్ చేయకుంటే ఆదాయం పన్ను చట్టంలోని 234ఎఫ్ సెక్షన్ కింద రూ.10 వేల వరకు ఫైన్ విధించొచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యపు లేదా సవరించిన ఐటీఆర్ దాఖలు చేయడానికి ఈ నెలాఖరు తుది గడువు.