ITR Filing Time | గత ఆర్థిక సంవత్సరం 2021-22 (అంచనా ఆర్థిక సంవత్సరం 2022-23) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగింపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఈ నెలాఖరులోగా పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సిందేనని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం స్పష్టం చేశారు. గత ఏడాది జూలై 20 నాటికి 2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాలు (2020-21 ఆర్థిక సంవత్సరం) ఐటీ రిటర్న్స్ను 2.3 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు దాఖలు చేశారని, రోజురోజుకు ఐటీఆర్ దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతుందని తరుణ్ బజాజ్ చెప్పారు.
గతేడాది డిసెంబర్ 31 నాటికి గత ఆర్థిక సంవత్సరంలో 5.89 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని తరుణ్ బజాజ్ తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ప్రతియేటా మాదిరిగానే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగిస్తారని భావిస్తున్నారు. అందుకే ప్రారంభ దశలో ఐటీఆర్ ఫైలింగ్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయన్నారు తరుణ్ బజాజ్. ప్రతి రోజూ 15 లక్షల నుంచి 18 లక్షల ఐటీ రిటర్న్స్ సబ్మిట్ అవుతున్నాయన్నారు. మున్ముందు రోజూ 25 నుంచి 30 లక్షల రిటర్న్స్ దాఖలవుతాయని చెప్పారు.
సాధారణంగా పన్ను చెల్లింపుదారులు ప్రతియేటా ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు వరకు వెయిట్ చేస్తుంటారు. `గత ఏడాది 9-10 శాతం మంది చివరి రోజు ఐటీఆర్ సబ్మిట్ చేశారు. మేం 50 లక్షలకు పైగా ఐటీఆర్లు (చివరి రోజు) అందుకున్నాం. ఈ సారి చివరి రోజు కోటి ఐటీఆర్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని మా శాఖ సిబ్బందికి, అధికారులకు సూచనలు చేశాను` అని తరుణ్ బజాజ్ చెప్పారు.